అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Published Thu, Jan 18 2018 4:23 AM

Nellore Student Suspicious Death - Sakshi

బుచ్చిరెడ్డిపాళెం: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వైనం పట్టణంలోని రామకృష్ణానగర్లో బుధవారం జరిగింది.  స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నర్సింగ్‌ గుప్తా కుటుంబం 20 ఏళ్ల నుంచి బుచ్చిరెడ్డిపాళెంలో పానీపూరీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వారి వద్ద పనిచేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఫతేపూర్‌ జిల్లా దివాన్‌పూర్‌కు చెందిన సంజయ్‌ (20) కొంతకాలం క్రితం వచ్చాడు. మంగళవారం సాయంత్రం పానీపూరీ అమ్మకాల అనంతరం ఇంటికి వచ్చి తోటి స్నేహితుడు పంకజ్‌తో కలిసి నిద్రపోయాడు.

 తెల్లవారుజామున సుశీల్‌ అనే వ్యక్తి వచ్చి సంజయ్‌ అని పిలిచినా పలకకపోవడంతో తలుపు తెరిచి చూశాడు. సంజయ్‌ తాడుకు వేలాడుతుండటంతో పంకజ్‌ను నిద్రలేపాడు. పంకజ్‌ ఈ విషయాన్ని నర్సింగ్‌ గుప్త కుమారులకు చెప్పాడు. దీంతో అతని పెద్ద కుమారుడు లల్లుగుప్తా, పంకజ్‌ కలిíసి సంజయ్‌ను కిందికి దించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రాణం ఉందేమో పరిశీలించారు. అప్పటికే మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఇన్‌చార్జి సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, ఏఎస్సై వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

హత్యా.. ఆత్మహత్యా!
మృతుడు సంజయ్‌ తండ్రి కౌశల్, తల్లి సుశీల వ్యవహారశైలి బాగా లేకపోవడంతో బాధపడేవాడని స్థానికులు చెబుతున్నారు. తల్లి ఇద్దరు భర్తలను వదిలి మూడో భర్తతో ఉంటోంది. రెండో భర్త పిల్లలైన సంజయ్‌ అవివాహితుడిగా, అతని చెల్లెలు వివాహం చేసుకుని వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో సంజయ్‌ ఒంటరి జీవితంతో బాధపడేవాడని అంటున్నారు. చెల్లెలి బాధ్యత సంజయ్‌పై ఉందని, చెల్లెలి భర్త వైపు నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని అంటున్నారు. ఈ క్రమంలో సంజయ్‌ ఏమైనా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే సంజయ్‌తోపాటు మంగళవారం రాత్రి అదే గదిలో పంకజ్‌ పడుకుని ఉన్నాడు. సంజయ్‌ ఉరేసుకునే క్రమంలో అలికిడికి పంకజ్‌ లేవకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు విచారణ, పోస్టుమార్టం రిపోర్ట్‌లో వాస్తవాలు వెల్లడికానున్నాయి.

Advertisement
Advertisement