భర్తతో గొడవపడి.. | Sakshi
Sakshi News home page

భర్తతో గొడవపడి..

Published Fri, Jan 19 2018 10:34 AM

woman suspicious death in madgula - Sakshi

మాడ్గుల: ఆరునెలల క్రితం భార్యాభర్తల మధ్య రాజుకున్న గొడవల ఫలితంగా గురువారం ఓ తల్లి తన ముగ్గురు కుమారులకు దూరంగా కానరానిలోకాలకు వెళ్లింది. అభంశుభం తెలియని ఆ చిన్నారులు బిక్కుబిక్కుమని ఏడుస్తుండడం చూసిన వారందరికీ కంట నీరు తెప్పించింది. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి జయమ్మ(30)గురువారం తమ వ్యవసాయ పొలంలోని పశువుల పాకలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మృతురాలు జయమ్మ, శివకృష్ణలు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమారులు కిరణ్, తరుణ్, చరణ్‌లు ఉన్నారు. ఈ దంపతుల మధ్య 6 నెలలక్రితం మనస్పర్ధలొచ్చి గొడవపడ్డారు.

ఈ నేపథ్యంలో జయమ్మ కడ్తాల్‌ మండలం చరికొండలోని పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉండిపోయింది. భర్త శివకృష్ణ ఆమెను తీసుకెళ్లడానికి రాకపోవడంతో జయమ్మ తల్లిదండ్రులు కడ్తాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శివకృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. కల్వకుర్తి కోర్టులో కేసు నడుస్తుండగా ఇటీవల మృతురాలి భర్త శివకృష్ణ చరికొండకు వెళ్లి అత్తగారింట్లో కొన్ని రోజులు ఉండి తన భార్య జయమ్మను తీసుకెళ్తానని భార్యతో గొడవపడకుండా ఉంటానని పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుని 15 రోజుల క్రితం మాడ్గులకు తీసుకొచ్చాడు. ఇదిలా ఉండగా గురువారం తమ చేలో పత్తి తీస్తుండగా ఆ దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన జయమ్మ పక్కనే ఉన్న పశువుల పాకలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా మృతురాలి అత్తమామలు బంధువుల ఇంట్లో జరిగే దశదిన కర్మకు వెళ్లారు.

పోలీస్‌స్టేషన్‌ ముందు మృతురాలి బంధువుల ఆందోళన
ఉరేసుకుని మృతిచెందిన కొత్తపల్లి జయమ్మ తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకోకముందే శవాన్ని మార్చురీకి తరలించడాన్ని నిరసిస్తూ మృతురాలి బంధువులు పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు. కడ్తాల మండలం చరికొండ గ్రామానికి చెందిన సుమారు 200 మంది డీసీఎం, ప్రైవేట్‌ వాహనాలలో మాడ్గుల పోలీస్‌స్టేషనుకు చేరుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు నచ్చజెప్పడంతో వారు శాంతించారు. మృతురాలు జయమ్మ తల్లి జెల్ల వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ జెలేందర్‌రెడ్డి తెలిపారు.

భర్త, అత్తమామలే చంపి ఉరేశారు: జయమ్మ తల్లి
తన కుమార్తెను భర్త శివకృష్ణ, అత్తమామలు లక్ష్మమ్మ, రాములయ్యలు కొట్టి చంపి ప శువుల కొట్టంలో ఉరి పోసి చంపి  ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి జెల్ల వెంకటమ్మ ఆరోపించారు. తమ కూతురు జయమ్మ మరణించిన విçషయం తమ కు చెప్పలేదని, తాము సంఘటన స్థలానికి రాకముందే శవాన్ని పోలీసులు పోస్టుమర్టానికి తరలించడాన్ని ఆమె తప్పుబడుతూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement