సౌత్‌జోన్‌ చాంప్‌ ఆంధ్ర | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ చాంప్‌ ఆంధ్ర

Published Sat, Mar 3 2018 10:33 AM

andhra wins South Zone championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ లీగ్‌ అండర్‌–23 మహిళల వన్డే క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. సౌత్‌జోన్‌ గ్రూప్‌లో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి చాంపియన్‌గా అవతరించింది. గ్రూప్‌లో భాగంగా ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించిన ఆంధ్ర ఒక మ్యాచ్‌లో పరాజయం పాలైంది. లీగ్‌ దశలో ఆకట్టుకున్న ఎన్‌. అనూష, కె. అంజలి శర్వాణి, ఇ.పద్మజ నాకౌట్‌ పోరులో పాల్గొనే సౌత్‌జోన్‌ అండర్‌–23 మహిళా జట్టుకు ఎంపికయ్యారు.

ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ సహాయంతో 279 పరుగులు సాధించిన అనూష టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్‌లో గురువారం గోవాతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 181 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి కేరళతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కారణంగా ఆంధ్ర అగ్రస్థానాన్ని దక్కించుకోగా, కేరళ రెండోస్థానంతో సరిపెట్టుకుంది.  ఆంధ్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు జీవీకే రంగరాజు, కార్యదర్శి సీహెచ్‌ అరుణ్‌ కుమార్‌ శుక్రవారం క్రీడాకారులను అభినందించారు.    

Advertisement
Advertisement