అడిలైడ్:భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఆసీస్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే అరోన్ ఫించ్ రూపంలో తొలి వికెట్ను కోల్పోయిన ఆసీస్..ఆపై తేరుకుంది. రెండో రోజు టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. శుక్రవారం ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆసీస్..ఇషాంత్ శర్మ వేసిన మొదటి ఓవర్లోనే ఫించ్ వికెట్ను చేజార్చుకుంది. తొలి ఓవర్ మూడో బంతికి ఫించ్ బౌల్డ్ కావడంతో ఆసీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. కాగా, మార్కస్ హారిస్-ఉస్మాన్ ఖవాజాల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది.
వీరిద్దరూ 45 పరుగులు జత చేసిన తర్వాత హారిస్(26) రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్లో మురళీ విజయ్కు క్యాచ్ ఇచ్చి హారిస్ వెనుదిరిగాడు. అటు తర్వాత స్పల్ప వ్యవధిలో షాన్ మార్ష్(2)సైతం అశ్విన్ బోల్తా కొట్టించడంతో ఆసీస్ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మరో 28 పరుగుల వ్యవధిలో ఖవాజా(28) కూడా అశ్విన్ బౌలింగ్లో ఔట్ కావడంతో ఆసీస్ 87 పరుగుల వద్ద నాల్గో వికెట్ను నష్టపోయింది. అయితే హ్యాండ్స్కాంబ్-ట్రావిస్ హెడ్లు కుదురుగా బ్యాటింగ్ చేయడంతో తిరిగి ఆసీస్ గాడిలో పడింది.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 250 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. 250/9 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన టీమిండియా పరుగులేమీ చేయకుండానే చివరి వికెట్ను కోల్పోయింది. మహ్మద్ షమీ(6) ఆఖరి వికెట్గా ఔటయ్యాడు.