గవాస్కర్నే మించిపోయిన అశ్విన్ | Sakshi
Sakshi News home page

గవాస్కర్నే మించిపోయిన అశ్విన్

Published Wed, Aug 10 2016 5:31 PM

గవాస్కర్నే మించిపోయిన అశ్విన్

గ్రాస్‌ఐలట్: వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ లో విశేషంగా రాణిస్తున్న భారత ఆల్ రౌండర్ రవించంద్రన్ అశ్విన్ మరో ఘనతను సాధించాడు. అత్యుత్తమ బ్యాటింగ్ సగటుతో ఏకంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రికార్డును దాటేశాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. విండీస్ పై కనీసం ఐదు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన భారత ఆటగాళ్లలో ఇప్పటివరకూ 65.45 సగటుతో గవాస్కర్ టాప్ లో ఉన్నాడు. 48 ఇన్నింగ్స్ లలో 13 సెంచరీలు చేసిన గవాస్కర్ 2749 పరుగులు చేయగా, 9 ఇన్నింగ్స్ లలో 66.57 బ్యాటింగ్ సగటుతో అశ్విన్ 466 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.

ఓ టెస్టు సిరీస్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పర్యాయాలు ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడంతో పాటు కనీసం రెండు ఇన్నింగ్స్ లలో 50కి పైగా పరుగులు చేసిన భారత మూడో ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. గతంలో కపిల్ దేవ్ రెండు సార్లు, భువనేశ్వర్ కుమార్ ఒకసారి ఈ అరుదైన ఫీట్ నెలకొల్పారు. వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో అశ్విన్ (75 నాటౌట్), సాహా(46 నాటౌట్) రాణించడంతో భారత్ తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి  5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement