'పోరాట యోధుడికే టీమిండియా పగ్గాలు' | Sakshi
Sakshi News home page

'పోరాట యోధుడికే టీమిండియా పగ్గాలు'

Published Tue, Jul 5 2016 6:25 PM

'పోరాట యోధుడికే టీమిండియా పగ్గాలు'

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ కోచ్ గా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే ఎంపికపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం గ్లెన్ మెగ్ గ్రాత్ ప్రశంసల జల్లులు కురిపించాడు. బీసీసీఐ చాలా గొప్ప నిర్ణయాన్ని తీసుకుందని ఓ మంచి వ్యక్తికి కోచ్ గా పగ్గాలు అప్పగించిందని పేర్కొన్నాడు. తన దృష్టిలో కోచ్  బ్యాట్స్ మన్, బౌలర్ అనే తేడా ఉండదని అంటూనే బౌలర్లు అయితేనే కాస్త బెటర్ అని అభిప్రాయపడ్డాడు. మొత్తానికి ఓ పోరాట యోధుడికి, మంచి వ్యక్తికి కోచ్ పగ్గాలు అప్పగించడం భారత్ కు మరింత మేలు చేస్తుందన్నాడు.

గత నెల 23న సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ సభ్యులు కోచ్ గా కుంబ్లేను ఎంపిక చేయడం, ఆ నిర్ణయంపై మాజీ ఆటగాడు, టీమిండియాకు డైరెక్టర్ గా సేవలందించిన రవిశాస్త్రి అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బౌలర్గా భారత్ కు విశిష్ట సేవలు అందజేసిన కుంబ్లే, కోచ్ గా కూడా మరింత ముందుకు సాగుతాడని మెక్ గ్రాత్ అన్నాడు. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు చాలా మంది కుంబ్లే ఎంపికపై హర్షం వ్యక్తం చేయగా, విదేశీ తాజా, మాజీ ఆటగాళ్లు ఆ నిర్ణయాన్ని ప్రశంసించడం కుంబ్లేకు మరింత ధైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహం అక్కర్లేదు.

Advertisement
Advertisement