డ్రా ముగిసిన వార్మప్ మ్యాచ్ | Sakshi
Sakshi News home page

డ్రా ముగిసిన వార్మప్ మ్యాచ్

Published Sun, Feb 19 2017 4:34 PM

డ్రా ముగిసిన వార్మప్ మ్యాచ్

ముంబై: ఆస్ట్రేలియా-భారత్ 'ఎ' జట్ల మధ్య ఇక్కడ బ్రాబోర్న్ స్టేడియంలో జరిగిన మూడో రోజుల వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. దాంతో ప్రాక్టీస్ మ్యాచ్ ను డ్రాతో సరిపెట్టుకున్నారు. అంతకుముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 91.5 ఓవర్లలో 403 పరుగులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. భారత్ 'ఎ' ఆటగాడు శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీతో ఇరగదీయడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కడవరకూ క్రీజ్ లో ఉన్న అయ్యర్ 210 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లతో 202 పరుగులతో అజేయంగా నిలిచాడు. 85 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రేయస్ అయ్యర్.. ఆద్యంత ఆకట్టుకుని డబుల్ సెంచరీతో మెరిశాడు.


176/4 ఓవర్ నైట్ స్కోరు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 'ఎ' జట్టు తొలి సెషన్ లో రిషబ్ పంత్(21) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత కాసేపటికి ఇషాన్ కిషన్(4) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో గౌతమ్ తో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ జోడి ఏడో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ 'ఎ' గాడిలో పడింది. ఈ క్రమంలోనే అయ్యర్ డబుల్ సెంచరీ చేయగా గౌతమ్(74) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 469/7 డిక్లేర్ చేసింది.

 

Advertisement
Advertisement