వార్నర్‌ మెరుపు సెంచరీ  | Sakshi
Sakshi News home page

వార్నర్‌ మెరుపు సెంచరీ 

Published Tue, Oct 29 2019 5:07 AM

Australia Won 1st T20 Match Against Srilanka - Sakshi

అడిలైడ్‌: సొంతగడ్డపై కొత్త సీజన్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. డేవిడ్‌ వార్నర్‌ (56 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) అంతర్జాతీయ టి20ల్లో తొలి శతకం సాధించడంతో... తొలి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 134 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా టి20ల్లో కంగారూలకు ఇదే అతి పెద్ద విజయం. వార్నర్‌కు తోడు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (36 బంతుల్లో 64; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆసీస్‌ 2 వికెట్లకు 233 పరుగులు సాధించింది. ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో టాప్‌–3 ఆటగాళ్లు ముగ్గురూ కనీసం అర్ధ సెంచరీ సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అనంతరం లంక కనీసం వార్నర్‌ స్కోరును కూడా చేరలేక చతికిలపడింది. ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. షనక (17)దే టాప్‌ స్కోరు. జంపా 3 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, కమిన్స్‌ చెరో 2 వికెట్లు తీశారు. రెండో టి20 బుధవారం బ్రిస్బేన్‌లో జరుగుతుంది. తన సోదరుడి వివాహం కారణంగా ఈ మ్యాచ్‌లో స్టార్క్‌పాల్గొనడంలేదు.

75 శ్రీలంక పేసర్‌ కసున్‌ రజిత 4 ఓవర్లలో ఇచ్చిన పరుగులు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రజిత కొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో టర్కీ బౌలర్‌ తునాహన్‌ తురాన్‌ (చెక్‌ రిపబ్లిక్‌పై) ఇచ్చిన 70 పరుగుల రికార్డు బద్దలైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement