Sakshi News home page

రెండో వన్డేలోనూ భారత మహిళల ఓటమి

Published Fri, Mar 16 2018 2:14 AM

Australian Women Crush India by 60 Runs to Seal Series 2-0 - Sakshi

వడోదర: తొలుత బౌలింగ్‌లో... ఆ తర్వాత బ్యాటింగ్‌లో వైఫల్యం కారణంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 0–2తో కోల్పోయింది. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా... మిథాలీ బృందం 49.2 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటై ఓటమి మూటగట్టుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బోల్టన్‌ (84; 12 ఫోర్లు), పెర్రీ (70 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మూనీ (56; 9 ఫోర్లు) చెలరేగడంతో భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో శిఖా 3, పూనమ్‌ 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు పూనమ్‌ (27; 2 ఫోర్లు), స్మృతి మంధాన (67; 12 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించారు. అనంతరం దీప్తి శర్మ (45 బంతుల్లో 26; 1 ఫోర్‌)  నెమ్మదిగా ఆడటంతో... సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. వచ్చి రాగానే మూడు బౌండరీలు బాదిన కెప్టెన్‌ మిథాలీ (15) కూడా త్వరగానే పెవిలియన్‌ చేరింది. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో హిట్టర్లు హర్మన్‌ప్రీత్‌ (17; 2 ఫోర్లు), వేద కృష్ణమూర్తి (2) వెనుదిరగడంతో భారత్‌ ఓటమి ఖరారైంది. ఆఖర్లో పూజ వస్త్రకర్‌ (30; 2 ఫోర్లు, 1సిక్స్‌) పోరాడటంతో భారత్‌ 200 మార్కు దాటగలిగింది.

Advertisement

What’s your opinion

Advertisement