ఇమ్రాన్‌ను మించి పాపులర్‌ అయ్యాడు: నెహ్రా | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ను మించి పాపులర్‌ అయ్యాడు: నెహ్రా

Published Mon, Apr 20 2020 4:33 PM

Balaji Was More Popular Than Imran Khan, Ashish Nehra - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేస్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా తనకు ఎంతగానో నచ్చిన 16 ఏళ్ల నాటి భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. కార్గిల్‌ యుద్ధం తర్వాత భారత్‌ తొలిసారిగా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు వెళ్లిన క్షణమది. 2003-04 సీజన్‌లో పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లిన భారత్‌ వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌,  రాహుల్‌ ద్రవిడ్‌, ఇర్పాన్‌ పఠాన్‌లు మెరుగైన ప్రదర్శనలతో  కీలక పాత్ర పోషించారు. అయితే ఆ సిరీస్‌లో అద్భుతంగా, అమోఘంగా రాణించిన బౌలర్‌ ఒకరున్నారని నెహ్రా పేర్కొన్నాడు. ఆ సిరీస్‌ మోస్ట్‌ పాపులర్‌ అయిపోయిన అతని పేరు లక్ష్మీపతి బాలాజీ అని నెహ్రా తెలిపాడు. (‘ధోని వ్యూహాలకు తగ్గ  కెప్టెన్లను తీసుకున్నాడు’)

వన్డే, టెస్టు సిరీస్‌ల్లో భాగంగా మ్యాచ్‌లన్నింటిలో బాలాజీ అత్యుత్తమ ప్రదర్శన చేశాడని, నిర్ణాయత్మక మూడో టెస్టులో 7 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడని నెహ్రా స్పష్టం చేశాడు. ఆ టూర్‌ మొత్తంలో బాలాజీ ఆడిన తీరు ఒకప్పటి పాకిస్తాన్ క్రికెటర్, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కంటే మెరుగ్గా ఉందన్నాడు. దాంతో పాకిస్తాన్‌ ప్రజల్లో ఇమ్రాన్‌ కంటే ఎక్కువగా బాలాజీ పాపులర్‌ అయిపోయాడన్నాడు. ఇది తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకమన్నాడు. ఒకవైపు వీరేంద్ర సెహ్వాగ్‌ సిక్సర్ల మోత, ఇర్ఫాన్‌ పఠాన్‌ స్వింగ్‌కు బాలాజీ మెరుపులు కూడా తోడవడంతో రెండు సిరీస్‌లను కైవసం చేసుకున్నామన్నాడు.  టెస్టు సిరీస్‌లో బాలాజీ బౌలింగ్‌ గణాంకాలు ఒకటైతే, వన్డే సిరీస్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా ఆకట్టుకోవడం ఇక్కడ విశేషమన్నాడు. ఆ వన్డే సిరీస్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బాలాజీ 160.71 స్టైక్‌రేట్‌తో 45 పరుగులు సాధించాడు. ఆ సిరీస్‌లో స్టైక్‌రేట్‌ పరంగా అఫ్రిది కంటే బాలాజీదే అధికం. (మియాందాద్‌ను కడిగేయాలనుకున్నారు..!)

Advertisement
Advertisement