శ్రీలంకకు షాక్‌ | Sakshi
Sakshi News home page

శ్రీలంకకు షాక్‌

Published Fri, Mar 16 2018 10:39 PM

Bangladesh beats srilanka to reach final - Sakshi

కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో శ్రీలంకకు మరో షాక్‌ తగిలింది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్‌.. ఆదివారం జరిగే భారత్‌తో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. మరొకవైపు స్వదేశంలో జరిగిన ట్రై సిరీస్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరకపోవడం ఆ దేశ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది.  లంక నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌(50) హాఫ్‌ సెంచరీ సాధించగా, మొహ్మదుల్లా(43 నాటౌట్‌)లు బంగ్లాదేశ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. కడవరకూ ఉత్కంఠ భరింతగా సాగిన పోరులో మొహ్మదుల్లా సిక్స్‌ కొట్టి విజయాన్ని అందించాడు.

 అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 159 పరుగులు చేసింది. దనుష గుణతిలకా(4), కుశాల్‌ మెండిస్‌(11), ఉపుల్‌ తరంగా(5), షనక(0), జీవన్‌ మెండిస్‌(3) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ కు చేరడంతో లంక 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో కుశాల్‌ పెరీరా-తిషారా పెరీరా జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 97 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో లంక తేరుకుంది.

ఓ దశలో వీరిద్దరూ చెలరేగి ఆడటంతో లంక స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ క్రమంలోనే కుశాల్‌ (61;40 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌) హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆపై తిషారా(58;37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అర్థ శతకంతో మెరిశాడు.

Advertisement
Advertisement