మహేంద్రుడికి మరో గౌరవం! | Sakshi
Sakshi News home page

మహేంద్రుడికి మరో గౌరవం!

Published Wed, Sep 20 2017 3:12 PM

మహేంద్రుడికి మరో గౌరవం!

పద్మభూషణ్ పురస్కారానికి ధోని పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి బీసీసీఐ సిఫారసు చేసింది. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలకు గుర్తింపుగా దేశంలో మూడో అత్యున్నత పురస్కారానికి ‘మిస్టర్‌ కూల్‌’ పేరును ప్రతిపాదించింది. పద్మ అవార్డులకు ఈ ఏడాది ధోని పేరు మాత్రమే సిఫారసు చేసినట్టు బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ధోని పేరును ఏకగ్రీవంగా బోర్డు సభ్యులు నామినేట్‌ చేశారని తెలిపారు.

‘మహేంద్ర సింగ్‌ ధోని పేరును పద్మభూషణ్ అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది. బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమకాలిన క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో ధోని ఒకడు. అతడి పేరును దేశ ప్రతిష్టాత్మక పురస్కారానికి ప్రతిపాదించడం సముచితమని భారత క్రికెట్‌ బోర్డు భావించింద’ని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా బుధవారం తెలిపారు. ‘మన దేశానికి చెందిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకడని.. వన్డేల్లో దాదాపు 10 వేల పరుగులు చేశాడు. 90 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అవార్డుకు నామినేట్‌ చేయడానికి ఇంతకంటే ఏం కావాల’ని ఖన్నా వ్యాఖ్యానించారు.

కెప్టెన్‌గా టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోని 302 వన్డేలు ఆడి  9737 పరుగులు సాధించాడు. 90 టెస్టుల్లో 4876 పరుగులు.. 78 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో1212 పరుగులు చేశాడు. 36 ఏళ్ల ధోని ఇప్పటికే అర్జున, రాజీవ్‌ ఖేల్‌ రత్న, పద్మశ్రీ అవార్డులు అందుకున్నాడు.

Advertisement
Advertisement