లోధా సంస్కరణల అమలుకు కమిటీ | Sakshi
Sakshi News home page

లోధా సంస్కరణల అమలుకు కమిటీ

Published Tue, Jun 27 2017 2:23 AM

లోధా సంస్కరణల అమలుకు కమిటీ

బీసీసీఐ ఎస్‌జీఎంలో నిర్ణయం  
ముంబై: లోధా ప్యానెల్‌ సూచించిన సంస్కరణల అమలుపై కిందామీదా పడుతున్న బీసీసీఐ ఈ వ్యవహారాన్ని మరికొంత కాలం వాయిదా వేయాలని భావిస్తున్నట్టుంది. దీంట్లో భాగంగా బోర్డు ప్రక్షాళన కోసం ప్యానెల్‌ పేర్కొన్న ప్రతిపాదనలను ‘అత్యుత్తమంగా వేగంగా’ ఎలా అమలు చేయాలో సూచించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం దాదాపు మూడు గంటల పాటు జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) ఏ విషయంలోనూ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ సమావేశానికి బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌ కూడా హాజరయ్యారు.

 ‘ఎనిమిది అంశాల అజెండాతో ఎస్‌జీఎం జరిగింది. లోధా ప్యానెల్‌ నివేదిక అమలు కోసం ఐదు లేక ఆరుగురితో కూడిన కమిటీని నేడు (మంగళవారం) ఎంపిక చేస్తాం. నూతన సంస్కరణలపై కోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తమంగా అమలు పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ 15 రోజుల్లోగా నివేదిక అందిస్తుంది. పరిపాలక కమిటీలోని సభ్యులు ఇందులో ఉండరు. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీటి అమలులో ఉన్న ఇబ్బందులను గుర్తించి సీఓఏకు తెలుపుతుంది’ అని కార్యదర్శి అమితాబ్‌ చౌదరి వివరించారు.

ఒక రాష్ట్రం ఒక ఓటు, 70 ఏళ్ల గరిష్ట వయస్సు, మూడేళ్ల కూలింగ్‌ పీరియడ్‌ అమలుపై బోర్డు సభ్యుల్లో వ్యతిరేకత కనిపిస్తున్న విషయం విదితమే. మరోవైపు  పాకిస్తాన్‌తో సిరీస్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇక భారత జట్టు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)దేనని చౌదరి చెప్పారు. వచ్చేనెలలో జట్టు లంక పర్యటనకు వెళ్లకముందే కోచ్‌ ఎవరో తేలుతుందని ఆయన అన్నారు.

Advertisement
Advertisement