వెండితెరపై మహిళా క్రికెటర్‌ బయోపిక్‌ | Sakshi
Sakshi News home page

వెండితెరపై మహిళా క్రికెటర్‌ బయోపిక్‌

Published Tue, Sep 19 2017 9:45 PM

వెండితెరపై మహిళా క్రికెటర్‌ బయోపిక్‌

కోల్‌కతా: మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పిన భారత ఫాస్ట్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే థియేటర్లలోకి వచ్చిన మహేంద్రసింగ్‌ ధోని, సచిన్‌ టెండూల్కర్‌ బయోపిక్‌లు అభిమానుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ తరహాలోనే ఝులన్‌ గోస్వామి జీవితం ఆధారంగా ‘చక్దాహా ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో ఒక సినిమాను తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్‌ దర్శకుడు సుశాంత దాస్‌ తాజాగా వెల్లడించారు. ఇటీవల ఇంగ్లాండ్‌లో ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో ఝులన్‌ గోస్వామి అద్భుతమైన ప్రదర్శనతో.. భారత్‌ జట్టుని ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించింది.

ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లోనూ మూడు వికెట్లు పడగొట్టి.. ఆ జట్టుని తక్కువ స్కోరుకు పరిమితం చేసింది. కానీ.. మన బ్యాటర్లు చివర్లో తడబడటంతో భారత్‌ తృటిలో కప్‌ను గెల్చుకునే అవకాశం చేజార్చుకుంది. ‘ఝులన్‌ గోస్వామి పాత్ర పోషించే నటి కోసం వెతుకుతున్నాం. సినిమా కోసం సంతకం చేసే వరకూ పేరు వెల్లడించం. అయితే.. బాలీవుడ్‌ ప్రముఖ నటితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని దర్శకుడు వెల్లడించారు. ఈ సినిమా హిందీ భాషలో మాత్రమే తెరకెక్కనుంది.  

Advertisement
Advertisement