మిథాలీకి బీఎండబ్ల్యూ కారు బహుకరణ | Sakshi
Sakshi News home page

మిథాలీకి బీఎండబ్ల్యూ కారు బహుకరణ

Published Tue, Aug 1 2017 11:58 AM

మిథాలీకి బీఎండబ్ల్యూ కారు బహుకరణ - Sakshi

హైదరాబాద్‌: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ బీఎండబ్ల్యూ కారును బహూకరించారు. పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో బీఎండబ్ల్యూ కారును మిథాలీకి చాముండేశ్వరి అందజేశారు. దీనిలో భాగంగా ప్రపంచ కప్‌ పోటీలో భారత మహిళల బృందంపై గోపీచంద్ ప్రశంసలు కురిపించారు. భారత జట్టును మిథాలిరాజ్‌ చక్కగా నడిపించారన్నారు. ఇది భారత క్రీడల్లో ప్రారంభం మాత్రమేనని, క్రీడాకారులకు మిథాలి వంటి వాళ్లు ఆదర్శం కాగలరని అన్నారు.

తాను గోపీచంద్ అకాడమికి మొదటిసారి వచ్చానని, ఆయన ఎంతోమంది బ్యాడ్మింటన్‌ క్రీడాకారులను మన దేశానికి అందించారని మిథాలిరాజ్‌ పేర్కొన్నారు. మహిళా క్రికెట్‌కు దేశంలో మంచి ఆదరణ ఉందన్నారు. చాముండేశ్వరినాథ్‌ దేశంలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. తన జోరును ఇలాగే కొనసాగిస్తానంటూ తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నారు.ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి రన్నరప్ గా నిలిచింది. భారత్ జట్టు ఫైనల్ కు చేరడంలో  మిధాలీ రాజ్ ముఖ్య భూమిక పోషించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement