కోల్కతా: ఐపీఎల్-11 సీజన్లో భాగంగా వేలంలో విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ను వదులుకోవడంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈసారి ఐపీఎల్ వేలంలోఆటగాళ్లను ఎంపిక చేయడం జరిగిందని కోహ్లి స్పష్టం చేశాడు. అదే కారణంతో గేల్ను వదులుకున్నామని, అంతే తప్పా మరే కారణం లేదన్నాడు.
'గత కొన్నేళ్లుగా గేల్ రాయల్ చాలెంజర్స్కు ఎంతో ఆడాడు. గేల్కు వయసుతో సంబంధం లేదు. కాకపోతే వచ్చే మూడేళ్లను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అతనికి బదులు ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలనుకున్నాం. ఈ క్రమంలోనే గేల్ను వదులుకోవాల్సి వచ్చింది' అని కోహ్లి తెలిపాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లకు మరోసారి వేలం నిర్వహించగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గేల్ను కొనుగోలు చేసింది.