రాష్ట్రానికి ఎనిమిది పతకాలు | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి ఎనిమిది పతకాలు

Published Fri, Jan 10 2014 12:57 AM

రాష్ట్రానికి ఎనిమిది పతకాలు - Sakshi

మహబూబ్‌నగర్ క్రీడలు, న్యూస్‌లైన్: జాతీయ అండర్-16 పైకా క్రీడల్లో రెండో రోజు గురువారం ఆంధ్రప్రదేశ్‌కు ఏడు పతకాలు లభించాయి. అందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. తైక్వాండో ఓవర్ 55 కేజీల విభాగంలో లక్ష్మీ కృష్ణశ్రీ రాష్ట్రానికి తొలిస్వర్ణం అందించగా... హైజంప్‌లో హాజీబాబా (1.75 మీటర్లు) మరో స్వర్ణం సాధించాడు. వంద మీటర్ల స్ప్రింట్‌లో అయ్యప్రసాద్, 800 మీటర్లలో రాముడు, బాలుర తైక్వాండో 73 కేజీల విభాగంలో అజయ్ రజతాలు గెలిచారు.

 తైక్వాండో బాలుర 48 కేజీల విభాగంలో రంజిత్, బాలికల 47 కేజీల విభాగంలో స్వర్ణలత, డిస్కస్‌త్రోలో నవ్య కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. వాలీబాల్‌లో రాష్ట్రానికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బాలుర జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లగా, బాలికలు సెమీస్‌లోనే వెనుదిరిగారు. బాలుర సెమీస్‌లో ఏపీ జట్టు 12-25, 22-25, 25-19, 25-12, 15-12 తేడాతో హర్యానాపై నెగ్గింది. బాలికలు 13-25, 13-25, 5-25 తేడాతో గుజరాత్ చేతిలో ఓడారు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు రాష్ట్రం రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్యాలు సాధించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement