జొహన్నెస్బర్గ్: ఇంగ్లండ్తో జరుగుతోన్న చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం ఎదురైంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 248 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మ్యాచ్ను అంపైర్లు నిలిపి వేశారు. దాంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లండ్ ప్రత్యర్థికి 466 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. జో రూట్ (58; 5 ఫోర్లు, సిక్స్) ‘టాప్’ స్కోరర్గా నిలిచాడు. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ బ్యూరన్ హెండ్రిక్స్ 5 వికెట్లతో మెరిశాడు.
కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఫిలాండర్ రెండో ఇన్నింగ్స్లో 9 బంతులు వేసిన అనంతరం గాయం కారణంగా మైదానం వీడాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 88/6తో బ్యాటింగ్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 183 పరుగులకు ఆలౌటైంది. మార్క్ వుడ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాడు బట్లర్ అవుటై పెవిలియన్కు వెళుతున్న సమయంలో అతడిని దూషించినందుకు గాను దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలాండర్పై మ్యాచ్ ఫీజులో ఐసీసీ 15 శాతం కోత విధించింది.