కోహ్లికి ఆ హక్కుంది: గంగూలీ | Sakshi
Sakshi News home page

కోహ్లికి ఆ హక్కుంది: గంగూలీ

Published Wed, Jul 31 2019 11:14 PM

Ganguly Praises Kohli During Press Meet In Kolkata - Sakshi

సాక్షి, కోల్‌కతా: భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లి కోచ్‌ ఎంపిక ప్రక్రియలో తన అభిప్రాయం వెల్లడించవచ్చని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. టీమిండియా సారథికి ఆ హక్కుందని ‘దాదా’ తెలిపాడు. వెస్టిండీస్‌ పర్యటనకు బయల్దేరేముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జట్టుకు కోచ్‌గా రవిశాస్త్రిని కొనసాగిస్తేనే బాగుంటుందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. దీనిపై స్పందించిన గంగూలీ ‘అతను జట్టు కెప్టెన్‌. జట్టుకు సంబంధించిన ప్రతీ అంశంపై మాట్లాడే హక్కు అతనికి ఉంది’ అని అన్నాడు.

పృథ్వీ షా సస్పెన్షన్‌పై మాట్లాడుతూ యువ క్రికెటర్‌ అనుకోకుండా నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకున్నాడని, సాధారణంగా అది దగ్గు మందులో ఉండేదని చెప్పాడు. ఈ మాజీ కెప్టెన్‌... గత క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడిగా ఉన్నప్పుడే 2017లో రవిశాస్త్రిని చీఫ్‌ కోచ్‌గా ఎంపిక చేశారు. సచిన్, వీవీఎస్‌ లక్ష్మణ్‌ అప్పటి సీఏసీ మిగతా సభ్యులు కాగా ఇప్పుడు దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్, అన్షుమన్‌ గైక్వాడ్, శాంతా రంగస్వామితో కూడిన సీఏసీ కొత్త కోచ్‌ ఎంపిక బాధ్యతను చేపట్టింది. మంగళవారంతో దరఖాస్తుల గడువు ముగిసింది. ఇక తదనంతర ప్రక్రియ మొదలవనుంది. గతంలో కపిల్‌ కమిటీ భారత మహిళా జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.  

Advertisement
Advertisement