హీనా మళ్లీ మెరిసింది | Sakshi
Sakshi News home page

హీనా మళ్లీ మెరిసింది

Published Wed, Nov 1 2017 12:43 AM

Gold at Commonwealth Shooting

బ్రిస్బేన్‌ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలిరోజే భారత షూటర్‌ హీనా సిద్ధూ మెరిసింది. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీ మహిళల 10మీ. ఎయిర్‌రైఫిల్‌ ఈవెంట్‌ ఫైనల్లో హీనా 240.8  పాయింట్లు స్కోర్‌ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా గాలియాబొవిచ్‌ (238.2), క్రిస్టీ గిల్‌మెన్‌ (213.7) వరుసగా రజత కాంస్యాలను గెలుచుకున్నారు. ఇటీవలే ఢిల్లీలో జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ షూటింగ్‌ టోర్నీలోనూ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో పసిడి పతకాన్ని సాధించిన హీనా, వారం తిరిగే లోపే మరో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

పురుషుల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో భారత్‌కు చెందిన దీపక్‌ కుమార్‌ 224.2 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకోగా, లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గగన్‌నారంగ్‌ 203 పాయింట్లు స్కోర్‌ చేసి నాలుగోస్థానంతో సంతృప్తి చెందాడు. మహిళల స్కీట్‌ ఈవెంట్‌లో రష్మీ రాథోడ్‌ (భారత్‌) ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆమె క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో 75 పాయింట్లకు గానూ 65 స్కోర్‌ చేసి ఫైనల్లో ఆఖరిదైన ఆరో స్థానాన్ని దక్కించుకుంది. 

Advertisement
Advertisement