సాక్షి, హైదరాబాద్: ఇండిపెండెన్స్ కప్ ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజి క్రికెట్ టోర్నీలో గురునానక్ కాలేజి శుభారంభం చేసింది. మంగల్పల్లిలోని భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ (బీఐఈటీ) గ్రౌండ్స్లో సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో గురునానక్ జట్టు 20 పరుగుల తేడాతో భారత్ ఫార్మసీ కాలేజిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన గురునానక్ ఇంజినీరింగ్ కాలేజి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. శ్రీనివాస్ (39) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ కాలేజి 6 వికెట్ల నష్టానికి 77 పరుగులే చేయగల్గింది.
అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజి 4 పరుగుల తేడాతో ఎంఆర్ఐటీఎస్పై నెగ్గింది. మొదట సీఎంఆర్ కాలేజి 4 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేయగా... ఎంఆర్ఐటీఎస్ 7 వికెట్లు కోల్పోయి 70 పరుగులే చేసింది. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ డీజీపీ బి. ప్రసాద రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భారత్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ సీహెచ్ వేణుగోపాల్ రెడ్డి, బీఐఈటీ స్పోర్ట్స్ డెరైక్టర్, ప్రొఫెసర్ సురేందర్ రెడ్డి, ఫిజికల్ డెరైక్టర్లు రాజేశ్, సురేశ్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.