క్వార్టర్స్‌లో గురుసాయిదత్ | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో గురుసాయిదత్

Published Fri, Mar 28 2014 3:20 AM

gurusai datt entered in quarter finals

జొహర్ బారు (మలేసియా): ఆంధ్రప్రదేశ్ షట్లర్ గురుసాయిదత్ మలేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్‌లో ఆరోసీడ్ గురుసాయి 23-21, 21-9 తేడాతో ఇండోనేసియాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు విస్ను యులీ ప్రసెట్యోపై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన రెండో రౌండ్‌లో గురు 21-18, 22-20 తేడాతో సెంగ్ జో యో (మలేసియా)ను ఓడించాడు. శుక్రవారం జరగనున్న క్వార్టర్స్‌లో గురుసాయిదత్‌కు  రెండో సీడ్ వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) రూపంలో కఠిన పరీక్ష ఎదురు కానుంది.
 
 భారత్‌కు చెందిన మరో ఆటగాడు సౌరభ్ వర్మ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చేతన్ ఆనంద్‌ను 21-14, 21-17తో ఓడించిన సౌరభ్ వర్మ.. ప్రి క్వార్టర్ ఫైనల్లో 21-15, 17-21, 21-19 తేడాతో కజుమస సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు. ఇక ఏపీకి చెందిన మరో ఆటగాడు సాయిప్రణీత్ పోరాటం ప్రి క్వార్టర్స్‌తోనే ముగిసింది. రెండో రౌండ్‌లో మలేసియా ఆటగాడు నూర్ మహ్మద్ అయూబ్‌పై 18-21, 21-12, 21-10 తేడాతో నెగ్గిన సాయిప్రణీత్.. తరువాతి రౌండ్‌లో తమసిన్ సిట్టికాన్ చేతిలో 17-21, 14-21 తేడాతో ఓడిపోయాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 9-21, 21-17, 18-21తో నన్ వీ (హాంకాంగ్) చేతిలో ప్రి క్వార్టర్స్‌లో ఓడగా, అనూప్ శ్రీధర్, ఆదిత్య ప్రకాష్‌లు రెండో రౌండ్‌లోనే వెనుదిరిగారు.
 
 అనూప్ 13-21, 11-21 తేడాతో కజుమస సకాయ్ చేతిలో ఓడగా, ఆదిత్యను సిమోన్ సాంటొసో (ఇండోనేసియా) 21-17, 21-10తో ఓడించాడు. డబుల్స్‌లో ఆల్విన్ ఫ్రాన్సిస్-అరుణ్ విష్ణు జోడి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ప్రి క్వార్టర్స్‌లో భారత జోడి 17-21, 21-19, 21-19 తేడాతో థాయ్‌లాండ్ జంట అంపున్సువాన్-పటిఫట్‌పై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లో పి.సి.తులసి ప్రి క్వార్టర్స్‌లో 21-2, 17-21, 21-18తో భారత్‌కే చెందిన తన్వీ లాడ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ 21-13, 17-21, 21-14తో పోహాన్‌యాంగ్-హంగ్‌యుచూన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి క్వార్టర్స్‌కు చేరింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement