టాప్ సీడ్‌గా గురుసాయిదత్ | Sakshi
Sakshi News home page

టాప్ సీడ్‌గా గురుసాయిదత్

Published Wed, Dec 11 2013 12:10 AM

Gurusaidutt seeded no. 1 in Tata Open India Challenge event

ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు గురుసాయిదత్‌కు టాప్ సీడింగ్ కేటాయించారు. మరో తెలుగు కుర్రాడు సాయిప్రణీత్‌కు రెండో సీడింగ్ లభించింది. బుధవారం మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. గురువారం నుంచి మెయిన్ ‘డ్రా’ పోటీలు ఆరంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చేతన్ ఆనంద్, వినయ్ కుమార్ రెడ్డి, రోహిత్ యాదవ్, ఎన్‌వీఎస్ విజేత, అజయ్ కుమార్ కూడా మెయిన్ ‘డ్రా’లో ఉన్నారు. క్వాలిఫయింగ్‌లో రాష్ట్రానికి చెందిన సీఎం శశిధర్, బాలూ మహేంద్ర, సృజన్ నందలూరి, కిరణ్ కుమార్ బరిలో ఉన్నారు. ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో నిర్వహిస్తున్నారు. 15 వేల డాలర్ల ప్రైజ్‌మనీగల ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 1,125 డాలర్ల (రూ. 68 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ ఇస్తారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓలేటి సిరి చందన, సంతోషి హాసిని, వడ్డేపల్లి ప్రమద పోటీపడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement