Sakshi News home page

పాండ్యా.. బంతిని కరణ్‌ అనుకున్నావా?

Published Sun, Feb 3 2019 3:04 PM

Hardik Pandya Slams Three Successive Sixes Against Todd Astle - Sakshi

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ముఖ్యంగా కివీస్‌ బౌలర్‌ టాడ్‌ అస్ట్లే వేసిన 47 ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లతో రెచ్చిపోయాడు. క్రీజులో ఉన్నంత సేపు వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలిస్తూ రన్‌రేట్‌ను పరుగెత్తించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో ఆటకు దూరమైన ఈ ఆల్‌రౌండర్‌.. ఆడుతున్నంత సేపు ఆ కసిని బంతి మీద చూపించినట్లు కనిపించింది.  తన సత్తా ఏంటో నిరూపించి జట్టుకు తన అవసరం ఏంటో గుర్తు చేశాడు. కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు 5 భారీ సిక్సర్లతో 45 పరుగులు చేసి భారత్‌ స్కోర్‌ 250 పరుగులు దాటడంలో ముఖ్య భూమిక పోషించాడు.

అయితే ఈ ఇన్నింగ్స్‌పై క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పాండ్యా తన పవరేంటో చూపించాడని, తన కసిని బంతిపై చూపించాడని కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరైతే.. ’హే పాండ్యా.. ఆ బంతిని కరణ్‌ జోహర్‌ అనుకున్నావా ఏందీ? అంత కసిగా బాదావ్‌ బ్రో’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. బాలీవుడ్‌ దర్శకుడైన కరణ్‌ జోహర్‌ ‘కాఫీ విత్‌ కరణ్‌షో’ లో పాండ్యా, రాహుల్‌లు ఒళ్లు మరిచి మాట్లాడి నిషేధానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి మూల కారణం కరణ్‌ జోహారేనని ఈ యువ క్రికెటర్ల అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. తన పిచ్చి ప్రశ్నల వల్లనే పాండ్యా, రాహుల్‌లు నోరుజారారని వారికి మద్దతు తెలుపుతున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement