అహ్మదాబాద్: టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య ఆదివారం ఇక్కడ రాజ్ కోట్ స్టేడియంలో జరుగనున్న మూడో వన్డేను అడ్డకుంటామని పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నాయకుడు హర్దిక్ పటేల్ హెచ్చరించాడు. దీనిలో భాగంగా రాజ్ కోట్ స్టేడియంలోకి ఇరు జట్లు ఆటగాళ్లు రాకుండా చుట్టుముడతామని హర్దిక్ పటేల్ తెలిపాడు.
తమ సామాజిక వర్గానికి టికెట్లు అమ్మకపోవడంపై ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో స్టేడియం చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. దీంతో పాటు నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మ్యాచ్ సజావుగా జరిగేందుకు పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ 90 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాజ్ కోట్ కు చేరుకున్న దక్షిణాఫ్రికా-టీమిండియా ఆటగాళ్లు శనివారం ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నారు.