గాలె: శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. రెండో టెస్టు మ్యాచ్లో కూడా అదే తరహా ఆట తీరును ప్రదర్శిస్తోంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 106 పరుగులకే కుప్పకూలింది. 54/2 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 52 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.
ఆసీస్ ఇన్నింగ్స్ను శ్రీలంక స్పిన్నర్లు రంగనా హెరాత్, దిలుర్ వాన్ పెరీరాలు కుప్పకూల్చారు. వీరిద్దరూ తలో నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. కాగా, హెరాత్ హ్యాట్రిక్ వికెట్లతో ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో భాగంగా 25.0 ఓవర్లలో వోజస్, నేవిల్,స్టార్క్లను వరుస బంతుల్లో పెవిలియన్ కు పంపిన హెరాత్ హ్యాట్రిక్ నమోదు చేశాడు.
ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్(42), మిచెల్ మార్ష్(27)లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన లంకేయులు డ్రింక్స్ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 98 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. అంతకుముందు లంక తన తొలి ఇన్నింగ్స్ లో 281 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.