అభిరత్, చైతన్య సెంచరీలు | Sakshi
Sakshi News home page

అభిరత్, చైతన్య సెంచరీలు

Published Tue, Jan 23 2018 10:44 AM

Hyderabad beats goa in under 23 cricket tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీసీఐ సౌత్‌జోన్‌ పురుషుల అండర్‌–23 క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో కేరళ చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్‌... రెండో మ్యాచ్‌లో గోవాపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. చెన్నైలోని ఎంఆర్‌ఎఫ్‌ పచియప్పస్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ అభిరత్‌ రెడ్డి (97 బంతుల్లో 110 నాటౌట్‌; 14 ఫోర్లు, ఒక సిక్స్‌) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా, పీఎస్‌ చైతన్య రెడ్డి (73 బంతుల్లో 101; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడైన శతకంతో కదం తొక్కాడు. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన గోవా 49.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. సుయశ్‌ ప్రభు దేశాయ్‌ (102 బంతుల్లో 92; 9 ఫోర్లు, ఒక సిక్స్‌) కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. వీజీ కహ్లాన్‌ (81 బంతుల్లో 60; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 118 పరుగుల్ని జోడించి జట్టుకు ఓ మోస్తరు స్కోరును అందించారు.

హైదరాబాద్‌ బౌలర్లలో టి. రవితేజ 3 వికెట్లు దక్కించుకున్నాడు. కార్తికేయ, వై. శ్రవణ్‌ కుమార్, తనయ్‌ త్యాగరాజన్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్‌ 254 పరుగుల లక్ష్యాన్ని 34.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిరత్‌ రెడ్డి, చైతన్య రెడ్డి బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్‌ బుద్ధి (15), ఎ. వరుణ్‌ గౌడ్‌ (22 నాటౌట్‌; 2 ఫోర్లు) రాణించారు. గోవా బౌలర్లలో ఫెలిక్స్, వీఏ నాయక్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ విజయంతో హైదరాబాద్‌ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. బుధవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో కర్ణాటకతో హైదరాబాద్‌ తలపడుతుంది. 

Advertisement
Advertisement