న్యూఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్ అంటే విధ్వంసకర బ్యాటింగ్ కు నిర్వచనం. తనదైన రోజున ఏ స్థాయి బౌలర్ అయినా చితక్కొట్టడమే సెహ్వాగ్ శైలి. సెహ్వాగ్ చాలా సమయాల్లో ఫోర్ తోనో, సిక్స్ తోనో ఇన్నింగ్స్ మొదలుపెట్టేవాడు. అదే ఆటను సెంచరీ దగ్గర కూడా కొనసాగించేవాడు. ప్రత్యర్థి బౌలర్ నుంచి వేగంగా వచ్చిన బంతిని సిక్స్ గా మలచి సెహ్వాగ్ సెంచరీ పూర్తి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి అటువంటి ఆటగాడ్ని భయపెట్టింది మాత్రం ఒకే ఒక్క బౌలర్.
శ్రీలంక టీమ్ కు సుదీర్ఘమైన సేవలందించి, టెస్టుల్లో అత్యధిక వికెట్లను తన ఖాతాలో వేసుకున్న ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ అంటే సెహ్వాగ్ కు భయమట. ఈ విషయాన్ని రిటైర్మెంట్ అనంతరం సెహ్వాగ్ వెల్లడించాడు. మురళీ బౌలింగ్ లో సాహసోపేతమైన షాట్లను ఆడాలంటే చాలా భయంగా ఉండేదన్నాడు. మురళీ బౌలింగ్ లో దూకుడుగా ఆడటానికి ఆలోచించే వాడినని సెహ్వాగ్ పేర్కొన్నాడు. తన కెరీయర్ లో మురళీ ఒక బెస్ట్ బౌలర్ అని తెలిపాడు.