ధోని సేన చేతిలో శ్రీలంక చిత్తు | Sakshi
Sakshi News home page

ధోని సేన చేతిలో శ్రీలంక చిత్తు

Published Fri, Feb 12 2016 10:40 PM

ధోని సేన చేతిలో శ్రీలంక చిత్తు - Sakshi

రాంచీ:శ్రీలంకతో తొలి ట్వంటీ 20లో ఎదురైన పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. జట్టులోని సమతుల్యతను గుర్తు చేస్తూ రెండో టీ 20 లో అద్భుత విజయాన్ని సాధించింది. తొలుత లంకేయుల్ని కుమ్మేసిన టీమిండియా.. ఆపై వారిని కట్టడి చేసి 69 పరుగుల తేడాతో మరపురాని గెలుపును సొంతం చేసుకుంది. దీంతో మూడు టీ 20ల సిరీస్  1-1తో సమం అయ్యింది.

టీమిండియా విసిరిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. ఆదిలోనే లంకకు ఎదురుదెబ్బ తగలడంతో ఇక తేరుకోలేకపోయింది. ఓపెనర్ దిల్షాన్(0) పరుగులేమీ చేయకుండా తొలి వికెట్ గా పెవిలియన్ చేరితే, ఆ తరువాత ప్రసన్న(1) కూడా అదే బాట పట్టాడు. మరికాసేపటికి గుణతిలకే(2) మూడో వికెట్ అవుట్ కావడంతో లంక కష్టాల్లో పడింది.ఆ తరుణంలో కెప్టెన్ చండిమాల్(31),కపుగదెరా(23)లు మరమ్మత్తులు చేపట్టడంతో శ్రీలంక కాస్త తేరుకుంది. అయితే ఈ జోడిని రవీంద్ర జడేజా వరుస బంతుల్లో పెవిలియన్ కు పంపడంతో ఇక లంకేయులు తేరుకోలేదు. ఆ తరువాత షనాకా(27), సిరివర్ధనే(28నాటౌట్) మోస్తరుగా ఫర్వాలేదనిపించి జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, ఆశిష్ నెహ్రా, బూమ్రా, జడేజాలకు తలో రెండు వికెట్లు లభించాయి.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 197 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ లో శిఖర్ ధావన్(51; 25 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్సర్లు) దూకుడుగా ఆడి భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. జట్టు స్కోరు 75 పరుగుల వద్ద శిఖర్ ధావన్ తొలి వికెట్ గా అవుట్ కావడంతో టీమిండియా దూకుడు కాస్త తగ్గింది. అనంతరం రోహిత్ శర్మ(43; 35 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆపై అజింక్యా రహానే(25) మోస్తరుగా ఫర్వాలేదనిపించి మూడో వికెట్ గా అవుటయ్యాడు. అటు తరువాత సురేష్ రైనా(30), పాండ్యా(27)లు  జాగ్రత్తగా ఆడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కెప్టెన్ ధోని(5 ) నాటౌట్ గా నిలిచాడు.


తొలి బంతి నుంచే దూకుడు

రోహిత్ శర్మ తొలి బంతి నుంచే దూకుడును కొనసాగించాడు. కాశున్ వేసిన తొలి బంతినే ఫోర్కు పంపిన రోహిత్.. మొదటి ఓవర్ లో ఏడు పరుగులు సాధించాడు. ఆ ఓవర్ లో ధావన్ కు రెండు బంతులు ఆడే అవకాశం వచ్చినా పరుగులు తీయలేదు. ఆ తరువాత రెండో ఓవర్ రెండో బంతికి రెండు పరుగులు తీసిన ధావన్ కొద్ది సేపటి తరువాత తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఒకపక్క రోహిత్ కుదురుగా ఆడుతుంటే, శిఖర్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే శిఖర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ జోడీ తొలి వికెట్ కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో  టీ20ల్లో భారత్ లో భారత్ తరపున రెండో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

మరోవైపు 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి భారత్ తరపున అత్యంత వేగంగా ఆ ఫీట్ ను సాధించిన మూడో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. గతంలో టీ 20ల్లో గంభీర్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే, యువరాజ్ సింగ్ 20 బంతుల్లో ఒకసారి, 12 బంతుల్లో మరొకసారి ఆ ఘనతను నమోదు చేసిన వారిలో ఉన్నారు.

పెరీరా హ్యాట్రిక్

రెండో టీ20లో శ్రీలంక పేస్ బౌలర్ తిషారా పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. హ్యాట్రిక్ సాధించి టీ 20ల్లో ఆ ఘనతసు సాధించిన తొలి లంక క్రికెటర్ గా నిలిచాడు. 19.0 ఓవర్ ను వేసిన పెరీరా హ్యాట్రిక్ తో శభాష్ అనిపించాడు. తొలుత కొన్ని బంతులను వైడ్లుగా వేసినా ఆ తరువాత కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో భారత ఆటగాళ్లను బోల్తా కొట్టించాడు. నాల్గో బంతికి పాండ్యాను అవుట్ చేసిన పెరీరా.. ఆ తరువాత రైనా, యువరాజ్ లను పెవిలియన్ కు పంపాడు.
 
ఆ ఓవర్ లో ఏడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీయడంతో టీమిండియా స్కోరు కాస్త తగ్గింది.  దీంతో ఓవరాల్ గా టీ 20ల్లో హ్యాట్రిక్ సాధించిన నాల్గో ఆటగాడిగా పెరీరా గుర్తింపు పొందాడు. అంతకుముందు బ్రెట్ లీ,జాకబ్ ఓరమ్, సౌతీలు హ్యాట్రిక్ లు సాధించిన వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement