సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. సఫారీ గడ్డపై ఆ జట్టుతో జరిగిన వన్డేలో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసిన రికార్డును టీమిండియా సాధించింది. ఫలితంగా 2000లో కేప్టౌన్లో ఆసీస్ సాధించిన అత్యధిక బంతుల విజయాన్ని భారత్ బ్రేక్ చేసింది. అప్పుడు దక్షిణాఫ్రికాపై ఆసీస్ 153 బంతులు మిగిలి ఉండగా విజయం సాధించగా, దాన్ని టీమిండియా బద్ధలు కొట్టింది.
తాజాగా భారత్ 177 బంతులు ఉండగా దక్షిణాఫ్రికాను వారి గడ్డపై ఓడించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఓవరాల్గా దక్షిణాఫ్రికాపై బంతులు పరంగా సాధించిన విజయాల్లో భారత్ నాల్గో స్థానంలో నిలిచింది. 2008లో ట్రెంట్ బ్రిడ్జ్లో ఇంగ్లండ్ 215 బంతులు ఉండగా సఫారీలపై విజయం సాధించి తొలి స్థానంలో ఉండగా, 2002లో సిడ్నీలో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 188 బంతులుండగా దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. 2003లో లార్డ్స్లో జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 178 బంతులు ఉండగా గెలుపును అందుకుంది.