మొహాలి: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో మూడు విషయాలు పునరావృతం అయ్యాయి. ప్రధానంగా రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించే క్రమంలో తీసుకున్న బంతులతో పాటు, తేదీ, శ్రీలంక పరిమితమైన స్కోరు పరంగా చూస్తే.. 2014లో లంకేయులతో ఈడెన్ గార్డెన్లో జరిగిన మ్యాచ్ ను జ్ఞప్తికి తెచ్చింది. లంకేయులతో బుధవారం(డిసెంబర్ 13) నాటి మ్యాచ్లో రోహిత్ శర్మ 151 బంతుల్లో డబుల్ సెంచరీని నమోదు చేయగా, గతంలో శ్రీలంకతో ద్విశతకాన్ని నమోదు చేసిన సమయంలో 151 బంతుల్లోనే తీసుకున్నాడు. మరొకవైపు ఆనాడు రోహిత్ డబుల్ సెంచరీ చేసిన మ్యాచ్ 13వ తేదీనే జరగ్గా, తాజాగా ద్విశతకం సాధించిన మ్యాచ్ కూడా 13వ తేదీన జరిగింది. ఇదిలా ఉంచితే, ఈ రెండు సార్లు శ్రీలంక జట్టు 251 పరుగులకే పరిమితం కావడం ఇక్కడ మరో విశేషం. ఇది యాధృచ్చికంగా జరిగినా కొన్ని విషయాల్లో సేమ్ సీన్ రిపీట్ కావడం ఆసక్తికరంగా మారింది.
లంకేయులతో మూడేళ్ల క్రితం నవంబర్ 13వ తేదీన జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు సాధించాడు. ఇదే నేటికి వన్డే ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. లంకేయులతో నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 208 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. 2013లో ఆస్ట్రేలియాపై తొలిసారి రోహిత్ శర్మ డబుల్ సెంచరీ నమోదు చేశాడు.