తిరువనంతపురం: న్యూజిలాండ్ తో ఇక్కడ జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ 20 లో టీమిండియా 68 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎనిమిది ఓవర్లకు కుదించబడ్డ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన భారత జట్టులో ఓపెనర్లు శిఖర్ ధావన్(6), రోహిత్ శర్మ(8) లు నిరాశపరిచారు. మనీష్ పాండే(17), హార్దిక్ పాండ్యా(14 నాటౌట్), కోహ్లి(13)లు కూడా ఆకట్టుకోలేకపోవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
శిఖర్, రోహిత్ లు వరుస బంతుల్లో..
పది ఓవర్ల కంటే తక్కువగా కుదించబడ్డ మ్యాచ్ లో భారత్ కు శుభారంభం దక్కలేదు. తొలి రెండు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే సాధించిన ఓపెనర్లు శిఖర్-రోహిత్ లు..మూడో ఓవర్లలో వరుసగా అవుటయ్యారు. సౌతీ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి భారీ షాట్ కు యత్నించిన ధావన్ అవుట్ కాగా, ఆ మరుసటి బంతికి రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరూ సాంట్నార్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరడం గమనార్హం. అటు తరువాత కెప్టెన్ కోహ్లి(13) కూడా అవుట్ కావడంతో భారత్ జట్టు 30 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తరుణంలో మనీష్ పాండే ఫర్వాలేదనిపించడంతో భారత్ జట్టు ఎనిమిది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.