మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ట్వంటీ 20లో టీమిండియా 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తమదైన శైలిలో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడి భారీ ఇన్నింగ్స్ ఏర్పడటానికి సహకరించారు. రోహిత్(60;47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ధావన్(42;32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడారు. ఈ జోడీ 97 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా, శిఖర్ హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో మ్యాక్స్ వెల్ బౌలింగ్ షాట్ కు యత్నించి తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు.
అనంతరం ఫస్ట్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లి ఆదిలో ఆచితూచి ఆడినా తరువాత రెచ్చిపోయాడు. ప్రత్యేకంగా 14 ఓవర్ లో హేస్టింగ్ బౌలింగ్ లో మూడు ఫోర్లు కొట్టిన కోహ్లి.. తరువాత బోలాండ్ వేసిన ఓవర్ లో సిక్స్ కొట్టి తన మార్కును ఆటను చూపెట్టాడు. కాగా, జట్టు స్కోరు 143 పరుగుల వద్ద అనవసర పరుగు కోసం యత్నించిన రోహిత్ శర్మ రనౌట్ గా అవుటయ్యాడు. అనంతరం ధోనితో కలిసిన విరాట్(59 నాటౌట్;33 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్) అదే ఊపును కొనసాగించి హాఫ్ సెంచరీ చేశాడు. ఇదిలా ఉండగా, చివరి ఓవర్ లో ధోని(14) అవుట్ కావడంతో సహా 10 పరుగులు మాత్రమే రావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.