భారత్‌కు రెండో విజయం | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో విజయం

Published Sun, Nov 22 2015 1:23 AM

భారత్‌కు రెండో విజయం

రాణించిన రిషబ్ పంత్    
అండర్-19 ముక్కోణపు సిరీస్
 కోల్‌కతా: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత యువ జట్టు... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 33 పరుగుల తేడాతో అఫ్ఘానిస్తాన్‌పై విజయం సాధించింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (88 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. మహిపాల్ (62 బంతుల్లో 43; 6 ఫోర్లు), కెప్టెన్ రికీ భుయ్ (27) ఫర్వాలేదనిపించారు. అమన్‌దీప్ ఖరే (24)తో కలిసి రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించిన పంత్... భుయ్‌తో మూడో వికెట్‌కు 75 పరుగులు సమకూర్చాడు. ఓ దశలో 201/6 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న భారత్... 35 పరుగుల తేడాలో చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. రషీద్ ఖాన్ 4 వికెట్లు తీశాడు.
 
 తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్తాన్ 47.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. రషీద్ ఖాన్ (43) టాప్ స్కోరర్. మహ్మద్ సర్దార్ (33), ముస్లిం మూసా (27), ఇసానుల్లా (25) ఓ మాదిరిగా ఆడారు. పేసర్ కలీల్ అహ్మద్ (4/41) ధాటికి అఫ్ఘాన్ టాప్ ఆర్డర్ విఫలమైంది. చివర్లో రషీద్, సర్దార్‌లు ఎనిమిదో వికెట్‌కు 62 పరుగులు జోడించి గెలిపించే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు సమర్థంగా అడ్డుకున్నారు. ప్రమాణిక్, మహిపాల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో మొత్తం 9 పాయింట్లు ఉన్నాయి. 
 

Advertisement
 
Advertisement