భారత్ వర్సెస్ బంగ్లా: కామెంటేటర్గా సూపర్ స్టార్ | Sakshi
Sakshi News home page

భారత్ వర్సెస్ బంగ్లా: కామెంటేటర్గా సూపర్ స్టార్

Published Wed, Mar 23 2016 6:08 PM

భారత్ వర్సెస్ బంగ్లా: కామెంటేటర్గా సూపర్ స్టార్

న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ నెల 19న ఈడెన్ గార్డెన్స్ లో భారత్-పాకిస్థాన్ మధ్య రసరంజకంగా జరిగిన మ్యాచ్ ను మిస్ అయ్యాడు. ఆ లోటు షారుఖ్ అభిమానులనే కాదు.. షారుఖ్ ను కూడా కలిచివేసింది. ఈ నేపథ్యంలో కీలకమైన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ను అత్యంత శ్రద్ధగా వీక్షించేందుకు ఆయన సిద్ధమయ్యాడు.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మరికాసేపట్లో భారత్-బంగ్లాదేశ్ పోరు జరుగనుంది. సెమిస్ ఆశలు నిలుపుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి తీరాల్సిందే. ఈ కీలకమైన మ్యాచ్ కు గొంతు ఇవ్వనున్నాడు షారుఖ్. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ తో కలిసి షారుఖ్ టీవీ కామెంటేటరీలో పాల్గొననున్నాడు. తన హస్కీ గొంతుతో మ్యాచ్ జరుగుతున్న తీరుని కామెంటేటర్ గా ఓ 20 నిమిషాలపాటు షారుఖ్ వివరిస్తారని తెలుస్తోంది.

దుబాయ్ లో చాలా బిజీగా ఉండటంతో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ కు షారుఖ్ హాజరుకాలేదు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలిసి ఆయన ఈ మ్యాచ్ లో జాతీయగీతాన్ని ఆలపించాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు రాకపోవడం తనను కూడా బాధించిందని, అల్లా దయతో ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలిచి వరల్డ్ కప్ అందుకుంటే చూడాలని ఉందని షారుఖ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారత్-బంగ్లా మ్యాచ్ కు కామెంటేటర్ గా గొంతు అందిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
 

Advertisement
Advertisement