నాలుగు వికెట్లు చాలు | Sakshi
Sakshi News home page

నాలుగు వికెట్లు చాలు

Published Mon, Dec 12 2016 12:49 AM

నాలుగు వికెట్లు చాలు

 సిరీస్ విజయానికి చేరువలో భారత్
 ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 182/6
 భారత్ తొలి ఇన్నింగ్స్ లో 631 ఆలౌట్
 కోహ్లి డబుల్ సెంచరీ, జయంత్ శతకం   

 
 మరో నాలుగు వికెట్లు... సొంతగడ్డపై చిరస్మరణీయ టెస్టు సిరీస్ విజయానికి, భారత్‌కు మధ్య ఉన్న అడ్డంకి. ముందుగా పరుగుల వరదతో ప్రత్యర్థికి అందనంత ఎత్తులో నిలబడిన భారత్, ఆ తర్వాత గింగిరాలు తిరుగుతున్న బంతులతో ఆరుగురి ఆటను ముగించింది. వరుసగా మూడో టెస్టును గెలుచుకొని వరుసగా ఐదో సిరీస్ విజయం సాధించడానికి భారత్ మరింత చేరువలో నిలిచింది. చేతిలో నాలుగే వికెట్లతో ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ మిగిలిన బ్యాటింగ్ సామర్థ్యం చూస్తే ఇక చివరి రోజు మిగిలింది లాంఛనమే.
 
 ఏమని వర్ణించాలి కోహ్లి ఆటను... ఒకదాని తర్వాత మరొకటి అలా అలవోకగా రికార్డుల మోత మోగిస్తూ చెలరేగిపోతున్న సూపర్‌స్టార్ బ్యాట్స్‌మన్ మరో మరపురాని ఇన్నింగ్స్ భారత్‌ను ఈ టెస్టులో ఎదురులేని స్థితిలో నిలిపింది. ఏడాదిలో మూడో సారి అతను డబుల్ సెంచరీతో చెలరేగి ముంబైని మురిపించాడు. మరోవైపు ఆడుతోంది మూడో టెస్టు అయినా... తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నా... అసలైన బ్యాట్స్‌మన్‌లా నిలబడి జయంత్ యాదవ్ కూడా సెంచరీ చేయడం నాలుగో రోజు ఆటలో విశేషం. కోహ్లికి జతగా అతను కూడా తన పేరిట పలు రికార్డులు లిఖించుకున్నాడు.  
 
 ముంబై: బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లూ విశేషంగా రాణించడంతో.... ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. వాంఖెడే మైదానంలో నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని అందరూ విశ్లేషించగా, అసలు అది ఆడాల్సిన అవసరమే రాకుండా చేసుకోవడంలో దాదాపుగా సఫలమైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 231 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్‌‌స బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమికి చేరువైంది. జో రూట్ (112 బంతుల్లో 77; 11 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, బెయిర్‌స్టో (95 బంతుల్లో 50 బ్యాటింగ్; 2 ఫోర్లు) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ మరో 49 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే  సిరీస్ 3-0తో భారత్ సొంతమవుతుంది.
 
 అంతకుముందు 451/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 631 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (340 బంతుల్లో 235; 25 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... జయంత్ యాదవ్ (204 బంతుల్లో 104; 15 ఫోర్లు) కూడా సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 241 పరుగులు జోడించడం విశేషం.
 
 జూనియర్ స్థాయి నుంచి కూడా నేను బాగానే బ్యాటింగ్ చేసేవాడిని. అయితే నా బ్యాటింగ్ ప్రతిభను మరింతగా ప్రదర్శించేందుకు హరియాణా జట్టు మంచి అవకాశాలు ఇచ్చింది. లోయర్ ఆర్డర్‌లో ఆడినా పరుగులు చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. దానిని నెరవేర్చాను. ఇక్కడ సెంచరీ, అంతకుముందు రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ కూడా తొమ్మిదో స్థానంలోనే చేశాను. కాబట్టి ఇక్కడ ఆడటంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఉదయం బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు అర్ధసెంచరీ చేస్తే చాలనే ఆలోచనతో ఉన్నాను. అయితే కోహ్లి ప్రోత్సాహంతో దూసుకుపోయాను.  - జయంత్ యాదవ్
 
 స్కోరు వివరాలు
 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 400

 భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) అలీ 24; విజయ్ (సి) అండ్ (బి) రషీద్ 136; పుజారా (బి) బాల్ 47; కోహ్లి (సి) అండర్సన్ (బి) వోక్స్ 235; నాయర్ (ఎల్బీ) (బి) అలీ 13; పార్థివ్ (సి) బెయిర్‌స్టో (బి) రూట్ 15; అశ్విన్ (సి) జెన్నింగ్‌‌స (బి) రూట్ 0; జడేజా (సి) బట్లర్ (బి) రషీద్ 25; జయంత్ (స్టంప్డ్) బెరుుర్‌స్టో (బి) రషీద్ 104; భువనేశ్వర్ (సి) వోక్స్ (బి) రషీద్ 9; ఉమేశ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (182.3 ఓవర్లలో ఆలౌట్) 631.
 
 వికెట్ల పతనం: 1-39; 2-146; 3-262; 4-279; 5-305; 6-307; 7-364; 8-605; 9-615; 10-631.

 బౌలింగ్: అండర్సన్ 20-5-63-0; వోక్స్ 16-2-79-1; అలీ 53-5-174-2; రషీద్ 55.3-5-192-4; బాల్ 18-5-47-1; స్టోక్స్ 10-2-32-0; రూట్ 10-2-31-2.
 
 ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: కుక్ (ఎల్బీ) (బి) జడేజా 18; జెన్నింగ్‌‌స (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; రూట్ (ఎల్బీ) (బి) జయంత్ 77; అలీ (సి) విజయ్ (బి) జడేజా 0; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 50; స్టోక్స్ (సి) విజయ్ (బి) అశ్విన్ 18; బాల్ (సి) పార్థివ్ (బి) అశ్విన్ 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (47.3 ఓవర్లలో 6 వికెట్లకు) 182.
 
 వికెట్ల పతనం: 1-1; 2-43; 3-49; 4-141; 5-180; 6-182.
 
 బౌలింగ్: భువనేశ్వర్ 4-1-11-1; ఉమేశ్ యాదవ్ 3-0-10-0; జడేజా 18-3-58-2; అశ్విన్ 16.3-1-49-2; జయంత్ యాదవ్ 6-0-39-1.
 
 5 ఒకే ఏడాది మూడు డబుల్ సెంచరీలు చేసిన ఐదో బ్యాట్స్‌మన్ కోహ్లి. గతంలో బ్రాడ్‌మన్, పాంటింగ్, మెకల్లమ్ మూడేసి ద్విశతకాలు చేయగా, క్లార్క్ 4 చేశాడు.
 
 3 ఒక సిరీస్‌లో 600కు పైగా పరుగులు రెండోసారి చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. గతంలో గావస్కర్, ద్రవిడ్ దీనిని సాధించారు.
 
 1 భారత్ తరఫున ఎనిమిదో వికెట్‌కు కోహ్లి, జయంత్‌లదే అత్యధిక (241) భాగస్వామ్యం. గతంలో అజహర్, కుంబ్లే పేరిట ఉన్న రికార్డు (161)ను వీరు సవరించారు.
 
 1 తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడు జయంత్ యాదవ్.
 
 1  కెప్టెన్ హోదాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (235) సాధించిన భారత ఆటగాడిగా కోహ్లి...
 ధోని (224)ను అధిగమించాడు.
 
 3 ఇంగ్లండ్ తరఫున ఒకే ఇన్నింగ్‌‌సలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో ఆదిల్ రషీద్ (192)ది మూడో స్థానం.  
 
 సెషన్-1: కోహ్లి ‘డబుల్’
 నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే తొలి ఓవర్లో ఫోర్ కొట్టి కోహ్లి 150 పరుగులకు చేరుకున్నాడు. తర్వాతి ఓవర్లో రెండు బౌండరీలతో దూకుడు ప్రదర్శించిన జయంత్, ఒక దశలో కోహ్లిని వెనక్కి నెట్టాడు. మొదటి గంటలో కోహ్లి 36 పరుగులు చేస్తే జయంత్ 42 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 103 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. కోహ్లి, జయంత్ ధాటిని ఆపడంలో విఫలమైన ఇంగ్లండ్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో అలవోకగా బ్యాటింగ్ చేస్తూ పోయారు. రషీద్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ వైపు కొట్టి సింగిల్ తీయడంతో 302 బంతుల్లో కోహ్లి డబుల్ సెంచరీ పూర్తయింది. ఈ మైలురాయిని చేరిన సమయంలో దాదాపు నిండుగా ఉన్న వాంఖెడే స్టేడియం ప్రేక్షకుల హోరుతో దద్దరిల్లింది. ప్రత్యర్థికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా భారత బ్యాట్స్‌మెన్ విజయవంతంగా సెషన్‌ను ముగించారు.
 ఓవర్లు: 29, పరుగులు: 128, వికెట్లు: 0 (భారత్)
 
 సెషన్-2: జడేజా దెబ్బ
 లంచ్ తర్వాత వోక్స్ వేసిన మూడో ఓవర్లో సింగిల్ తీసి జయంత్ 196 బంతుల్లో కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఎట్టకేలకు రషీద్ ఈ భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. ముందుకొచ్చి ఆడబోయిన జయంత్ స్టంపౌంట్ కావడంతో ఒక చిరస్మరణీయ ఇన్నింగ్‌‌స ముగిసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే వోక్స్ బౌలింగ్‌లో అండర్సన్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి మారథాన్ బ్యాటింగ్‌కు బ్రేక్ పడింది. అనంతరం భువనేశ్వర్ (9)ను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది.  సుదీర్ఘ సమయం పాటు మైదానంలో గడిపిన అనంతరం మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మరోసారి తడబాటుకు లోనైంది. భువనేశ్వర్ వేసిన రెండో బంతికే మొదటి ఇన్నింగ్‌‌స సెంచరీ హీరో కీటన్ జెన్నింగ్‌‌స (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన రూట్ తన శైలికి విరుద్ధంగా ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా మంచి టెక్నిక్‌తో అతను స్పిన్‌ను ఎదుర్కొన్నాడు. మరోవైపు జడేజా వేసిన చక్కటి బంతికి కుక్ (18) వెనుదిరిగాడు. ఇది జడేజా కెరీర్‌లో 100వ వికెట్ కావడం విశేషం. జడేజా తన తర్వాతి ఓవర్లో అలీ (0)ని కూడా పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్ కష్టాలు పెరిగాయి.
 ఓవర్లు: 11.3, పరుగులు: 52, వికెట్లు: 3 (భారత్); ఓవర్లు: 13.2, పరుగులు: 49, వికెట్లు: 3 (ఇంగ్లండ్)
 
 సెషన్-3: బెరుుర్‌స్టో పోరాటం
 విరామం తర్వాత రూట్, బెయిర్‌స్టో కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రూట్ 75 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఆడిన వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. అయితే జయంత్ వేసిన చక్కటి బంతి ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. రివ్యూకు కూడా ఎలాంటి అవకాశం లేని రీతిలో వికెట్ల ముందు దొరికిపోయి రూట్ నిష్క్రమించాడు. జయంత్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన స్టోక్స్ (18) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అశ్విన్ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా, బంతి అతని కాలికి తగిలి స్లిప్‌లో విజయ్ చేతుల్లో పడింది. మరోవైపు రెండు సార్లు ‘రివ్యూ’ కోరి విజయవంతంగా తన వికెట్‌ను కాపాడుకున్న బెయిర్‌స్టో 89 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అరుుతే కొద్దిసేపటికే బాల్ (2)ను కూడా అశ్విన్ అవుట్ చేయడంతో నాలుగో రోజు ముగిసింది.
 ఓవర్లు: 34.1, పరుగులు: 133, వికెట్లు: 3 (ఇంగ్లండ్)
 

Advertisement
Advertisement