వైజాగ్‌ టెస్టులో సరికొత్త వరల్డ్‌ రికార్డు | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ టెస్టులో సరికొత్త వరల్డ్‌ రికార్డు

Published Sun, Oct 6 2019 2:52 PM

India vs South Africa 1st Match Most Sixes In A Test Match - Sakshi

విశాఖ: టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడ జరిగిన తొలి టెస్టు పలు రికార్డులకు వేదికైంది. ఓపెనర్‌గా తొలి టెస్టులోనే రోహిత్‌ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించి ఆ ఫీట్‌ నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధిస్తే, భారత్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 350వ టెస్టు వికెట్లను 66వ టెస్టులోనే సాధించి అత్యంత వేగవంతంగా ఆ ఘనతను అందుకున్న జాబితాలో ముత్తయ్య మురళీ ధరన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.  ఇక దక్షిణాఫ్రికా టెయిలెండర్‌ బ్యాట్స్‌మన్‌ పీయుడ్త్‌ 10 వస్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్‌ సెంచరీ సాధించడం ద్వారా భారత్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా తరఫున ఆ ఘనత సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.(ఇక‍్కడ చదవండి: రెండో సెషన్‌లోనే దక్షిణాఫ్రికా ‘ఖేల్‌’ ఖతం)

ఇదిలా ఉంచితే,  వైజాగ్‌ టెస్టులో మరో రికార్డు నమోదైంది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 37 సిక్సర్లు సాధించాయి. ఫలితంగా ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన రికార్డు భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య లిఖించబడింది. 2014-15  సీజన్‌లో పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన టెస్టులో 35 సిక్సర్లు రికార్డు ఇప్పటివరకూ టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా-దక్షిణాఫ్రికాలు బ్రేక్‌ చేశాయి.

భారత్‌ తన తొలి ఇన‍్నింగ్స్‌లో 13 సిక్సర్లు సాధిస్తే, దక్షిణాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు కొట్టింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో  భారత్‌ సాధించిన సిక్సర్లు 14 కాగా, దక్షిణాఫ్రికా 3 సిక్సర్లకే పరిమితమైంది. రవీంద్ర జడేజా వేసిన 35 ఓవర్‌లో పీయడ్త్‌ సిక్స్‌ను కొట్టడం ద్వారా పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ల పేరిట ఉన్న 35 సిక‍్సర్ల రికార్డు బద్ధలైంది.  కాగా, చివర్లో రబడా సిక్స్‌ కొట్టడంతో మ్యాచ్‌లో సిక్సర్ల సంఖ్య 37కు చేరింది.

Advertisement
Advertisement