భారత క్రికెట్‌ జట్టుకు ఉగ్ర బెదిరింపు? | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్‌ జట్టుకు ఉగ్ర బెదిరింపు?

Published Mon, Aug 19 2019 10:50 AM

Indian Cricket Teams Security Hiked In West Indies - Sakshi

కూలిడ్జ్‌: వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టీమిండియాకు ఉగ్రముప్పు పొంచి ఉందని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి మెయిల్‌ రావడం కలవరపాటుకు గురి చేసింది. విండీస్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్ల కదలికల్ని ఎప్పటికప్పుడూ ఫాలో అవుతున్నామని,  ఆటగాళ్లు ప్రమాదంలో ఉన్నారంటూ బీసీసీఐకి మెయిల్‌ వచ్చింది. ఆదివారం వచ్చిన ఈ మెయిల్‌పై బీసీసీఐ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యాడు. ఈ క్రమంలోనే ఆంటిగ్వాలోని భారత హైకమిషన్‌కు సమాచారమిచ్చామని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి చెప్పారు. ఈ నేపథ్యంలో హైకమిషన్‌.. స్థానిక ప్రభుత్వ యంత్రంగాన్ని అప్రమత్తం చేసిందని, భారత ఆటగాళ్లకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసిందని  చెప్పారు. తొలుత పీసీబీకి ఆ మెయిల్‌ వచ్చిందని, దాన్ని ఐసీసీతో బీసీసీఐకి వారు పంపినట్లు తెలుస్తోంది.

ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారి చెప్పుకొచ్చారు. అక్కడి పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉందని, అవసరమైతే మరింత భద్రత పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు గెలవగా ప్రస్తుతం కూలిడ్జ్‌లో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతోంది. సోమవారం ఈ మ్యాచ్‌ పూర్తవుతుండగా.. ఈనెల 22 నుంచి టెస్టు సిరీస్‌ ఆడనుంది. 

Advertisement
Advertisement