మళ్లీ దాయాదుల సమరం | Sakshi
Sakshi News home page

మళ్లీ దాయాదుల సమరం

Published Thu, Jun 2 2016 12:31 AM

మళ్లీ దాయాదుల సమరం

చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి ప్రత్యర్థి పాకిస్తాన్
►  వచ్చే ఏడాది జూన్ 1నుంచి 18 వరకు టోర్నీ

 
లండన్:  ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య మరో మ్యాచ్ ఖరారు అయింది. వచ్చే ఏడాది జూన్ 1నుంచి 18 వరకు ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి. జూన్ 4న బర్మింగ్‌హామ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఐసీసీ వన్డే, టి20 ప్రపంచకప్‌లలో భారత్‌తో తలపడిన 11 సార్లూ ఓడిన పాకిస్తాన్... ఒక్క చాంపియన్స్ ట్రోఫీలోనే ఆధిక్యం ప్రదర్శించింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా...భారత్ 1 గెలిచి 2 ఓడింది. భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. టోర్నీకి సరిగ్గా ఏడాది ముందు ఐసీసీ బుధవారం చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసింది.

30 సెప్టెంబర్, 2015నాటికి ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లు దీనికి క్వాలిఫై అయ్యాయి. మాజీ చాంపియన్ వెస్టిండీస్ తొలి సారి ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోగా... జింబాబ్వే కూడా దూరమైంది. జూన్ 1న జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రెండు గ్రూప్‌లనుంచి టాప్-2 జట్లు సెమీస్‌లోకి అడుగు పెడతాయి. 18న ఓవల్‌లో ఫైనల్ నిర్వహిస్తారు. 2004, 2013 తర్వాత ఇంగ్లండ్ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడో సారి.
 
 
 
 గ్రూప్ ‘ఎ’ - ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్
 గ్రూప్ ‘బి’ - భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక

Advertisement

తప్పక చదవండి

Advertisement