న్యూఢిల్లీ: వచ్చే నెల్లో ఇంగ్లండ్ జరిగి చాంపియన్స్ ట్రోఫీలో భారత విజయావకాశాలు కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్ పై మాత్రమే ఆధారపడతాయనడం ఎంతమాత్రం సరికాదని దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ఏదో ఒక్కడి ప్రదర్శన ఆధారంగా జట్టు విజయాలు సాధిస్తుందనడంలో వాస్తవం లేదన్నాడు. ప్రస్తుత విరాట్ కోహ్లి ఫామ్ చాంపియన్స్ ట్రోఫీలో ఏమైనా ప్రభావం చూపతుందా అనే దానిపై కపిల్ దేవ్ స్పందించాడు.
'భారత జట్టు గత ఐదేళ్ల నుంచి అద్భుతమైన విజయాలు సాధిస్తుంది. అది సమష్టి కృషి. ఆ విజయాలకు మనకు అర్హత ఉంది కాబట్టి గెలుస్తున్నాం. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయాలు సాధించడమే మనకు ఎక్కువగా కనబడుతుంది. అటువంటప్పుడు ఒక్కడి ప్రదర్శన ఆధారంగా ఎలా గెలుస్తామని చెబుతాం. ఇటీవల ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఏమైంది. కోహ్లి ఆడతేనే గెలుస్తామని అన్నారు. మరి ఆ మ్యాచ్ లో ఏం జరిగింది'అని కపిల్ ప్రశ్నించాడు. ఇలా ఒకరిపైనే జట్టు ఆధారపడిందని చెప్పటం మిగతా సభ్యుల్ని కించపరచటమేనని కపిల్ అభిప్రాయపడ్డాడు.జూన్ 1 వ తేదీ నుంచి ఆరంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగుతోంది.