దినేశ్‌ కార్తీక్‌ గెలిపించాడు.. | Sakshi
Sakshi News home page

దినేశ్‌ కార్తీక్‌ గెలిపించాడు..

Published Sun, Mar 18 2018 10:53 PM

 Karthik blitz powers India to Nidahas Trophy win - Sakshi

కొలంబో: శ్రీలంకలో జరిగిన ముక్కోణపు టీ 20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆదివారం బంగ్లాదేశ్‌తో చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. దినేశ్‌ కార్తీక్‌ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 29 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించాడు. భారత్‌ చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు కావాల్సిన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ చెలరేగి ఆడాడు. విజయం భారత్‌ చేజారి పోయిందనుకున్న తరుణంలో దినేశ్‌ కార్తీక్‌ ఎప్పటికీ గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌తో మైమరిపించాడు. ఓవరాల్‌గా ట్రై సిరీస్‌ను దినేశ్‌ కార్తీక్‌ గెలిపించి భారత్‌ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తాడు.

బంగ్లా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో భారత్‌ 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. శిఖర్‌ ధావన్‌(10), రైనా(0)లు తీవ్రంగా నిరాశపరిచారు. కాగా, రోహిత్‌ శర్మ (56) బాధ్యతాయుతంగా ఆడాడు. 42బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో రాణించాడు. ఇక మనీష్‌ పాండే(28), రాహుల్‌(24) మోస్తరుగా ఆడారు. అయితే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విజయ్‌ శంకర్‌ బంతుల్ని అనవసరంగా వృథా చేసి మ్యాచ్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. కాగా, ఆ తరుణంలో దినేశ్‌ కార్తీక్ టీ20 మ్యాచ్‌ ఎలా ఆడాలో చూపించి ప్రేక్షకుల్ని కనువిందు చేశాడు.

ప్రధానంగా ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు రావాల్సిన సమయంలో  తొలి రెండు బంతులకు పరుగు మాత్రమే వచ్చింది. ఇక మూడో బంతికి కార్తీక్‌ పరుగు సాధించగా, నాల్గో బంతికి విజయ్‌ శంకర్‌ ఫోర్‌ కొట్టాడు. ఐదో బంతికి విజయ్‌ శంకర్‌ క్యాచ్‌ రూపంలో అవుట్‌ కావడంతో ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమైంది. అదే సమయంలో స్టైకింగ్‌కు వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ ఎటువంటి తడబాటు లేకుండా చివరి బంతిని సిక్స్‌ కొట్టి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

అంతకుముందు బంగ్లాదేశ్‌ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షబ్బీర్‌ రెహ్మాన్‌ దూకుడుగా ఆడి బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దాటిగా బ్యాటింగ్‌ చేసి బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు సాధించాడు.

టాస్‌ గెలిచిన భారత్‌ ముందుగా బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లిటాన్‌ దాస్‌(11), తమీమ్‌ ఇక్బాల్‌(15), సౌమ్య సర్కార్‌(1)లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. అయితే షబ్బీర్‌ రెహ్మాన్‌ మాత్రం సమయోచితంగా చెలరేగి ఆడాడు. మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే, చెడ్డ బంతుల్ని బౌండరీ దాటించాడు. మొహ్మదుల్లా(21)తో కలిసి 36 పరుగుల్ని జత చేసిన తర్వాత షబ్బీర్‌ చెలరేగి ఆడాడు. ఆ క‍్రమంలోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరింత ప్రమాదకరంగా మారాడు. కాగా, షబ్బీర్‌ ఏడో వికెట్‌గా పెవిలియన్‌ చేరడంతో బంగ్లాదేశ్‌ స్కోరులో వేగం తగ్గింది. కాగా, చివర్లో మెహిదీ హసన్‌(19 నాటౌట్‌; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్‌ మూడు వికెట్లు సాధించగా, జయదేవ్‌ ఉనాద్కత్‌ రెండు వికెట్లు తీశాడు. వాషింగ్టన్‌ సుందర్‌కు వికెట్‌ దక్కింది.

Advertisement
Advertisement