ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్‌ | Sakshi
Sakshi News home page

ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్‌

Published Thu, Dec 15 2016 1:37 AM

ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్‌

షూటౌట్‌లో ఢిల్లీ డైనమోస్‌పై విజయం
18న కోల్‌కతాతో టైటిల్‌ పోరు


న్యూఢిల్లీ: టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఈసారి ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన కేరళ బ్లాస్టర్స్‌ లక్ష్యానికి చేరువైంది. ఢిల్లీ డైనమోస్‌తో జరిగిన సెమీఫైనల్లో కేరళ బ్లాస్టర్స్‌ 3–0తో పెనాల్టీ షూటౌట్‌లో విజయాన్ని దక్కించుకుంది. ఈనెల 18న జరిగే ఫైనల్లో అట్లెటికో డి కోల్‌కతాతో కేరళ బ్లాస్టర్స్‌ తలపడుతుంది.కొచ్చిలో జరిగిన తొలి అంచె సెమీఫైనల్లో 1–0తో నెగ్గిన కేరళ బ్లాస్టర్స్‌... ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన రెండో అంచె సెమీఫైనల్లో 1–2 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది.

ఢిల్లీ తరఫున పెరీరా (21వ ని.లో), రోచా (45వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... కేరళ జట్టుకు నజోన్‌ (24వ ని.లో) ఏకైక గోల్‌ అందించాడు. రెండు అంచెల సెమీఫైనల్‌ తర్వాత ఇరు జట్ల స్కోరు 2–2తో సమం కావడంతో ఫలితం తేలడానికి పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. కేరళ బ్లాస్టర్స్‌ తరఫున జోసు కురైస్, కెర్వెన్‌ బెల్‌ఫోర్ట్, మొహమ్మద్‌ రఫీక్‌ సఫలమవ్వగా... ఢిల్లీ తరఫున ఫ్లోరెంట్‌ మలూదా, బ్రూనో పెలిసారి, ఎమర్సన్‌ గోమ్స్‌ విఫలమయ్యారు. మలూదా కొట్టిన షాట్‌ గోల్‌ పోస్ట్‌ పైనుంచి బయటకు వెళ్లగా... పెలిసారి, గోమ్స్‌ షాట్‌లను కేరళ గోల్‌కీపర్‌ సందీప్‌ నందీ నిలువరించాడు.

Advertisement
Advertisement