డేర్‌డెవిల్స్‌పై కింగ్స్‌దే పైచేయి | Sakshi
Sakshi News home page

డేర్‌డెవిల్స్‌పై కింగ్స్‌దే పైచేయి

Published Sun, Apr 8 2018 7:41 PM

Kings Punjab beat Delhi Daredevils by 6 wickets - Sakshi

మొహాలీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్‌ 18.5 ఓవర్లలో ఛేదించింది.  కింగ్స్‌ ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌(51; 16 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వేగవంతమైన ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీకి జతగా కరుణ్‌ నాయర్‌(50;33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ శతకం సాధించి గెలుపులో కీలక పాత్ర పోషించారు.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది.  ప్రధానంగా రాహుల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కింగ్స్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను ప్రేక్షకపాత్రకే పరిమితం చేసిన రాహుల్‌ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే 3.2 ఓవర్లలో 58 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మయాంక్‌ అగర్వాల్‌(7) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అయితే 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్‌.. జట్టు స్కోరు 64 పరుగుల వద్ద రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత యువరాజ్‌ సింగ్‌(12) నిరాశపరచగా, కరుణ్‌ నాయర్‌ అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో డేవిడ్‌ మిల్లర్‌(24 నాటౌట్‌;23 బంతుల్లో 1 ఫోర్‌), మార్కస్‌ స్టోనిస్‌(22 నాటౌట్‌; 15 బంతుల్లో 2 ఫోర్లు) ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే లాంఛనం పూర్తి చేశారు.


ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌  జట్టులో కెప్టెన్‌ గౌతం గంభీర్‌(55;42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా, రిషబ్‌ పంత్‌(28;13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌), క్రిస్‌ మోరిస్‌(27 నాటౌట్‌; 16 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌)లు మోస‍్తరుగా ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కోలిన్‌ మున్రో, గంభీర్‌లు ఆరంభించారు. జట్టు 12 పరుగుల వద్ద ఉండగా మున్రో(4) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై శ్రేయస్‌ అయ్యర్‌(11), విజయ్‌ శంకర్‌(13)లు కూడా నిరాశపరిచారు. కాగా, గంభీర్‌ మాత్రం సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.  36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ గంభీర్‌ మాత్రం నిలకడగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇది గంభీర్‌కు 36వ ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ.

కాగా, జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉండగా గంభీర్‌(55) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనవసరపరుగు కోసం యత్నించి రనౌట్‌గా నిష్క్రమించాడు. అంతకుముందు రిషబ్‌ పంత్‌(28) దాటిగా ఆడే క్రమంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మోరిస్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement