మొహాలి:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఇక్కడ గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిదింగా కింగ్స్ పంజాబ్ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్కు ఓపెనర్లు మురళీ విజయ్(42; 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్),వాహ్రా(38;23 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లు) శుభారంభాన్ని అందించారు.
ఈ జోడీ తొలి వికెట్కు 8.2 ఓవర్లలో 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే ఆ తరువాత మ్యాక్స్వెల్(2), కెప్టెన్ డేవిడ్ మిల్లర్(15) వరుస బంతుల్లో పెవిలియన్ కు చేరడంతో స్కోరు మందగించింది. కాగా చివర్లో స్టోనిస్(33), సాహా(20) లు ఫర్వాలేదనిపించడంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. గుజరాత్ లయన్స్ బౌలర్లలో బ్రేవో నాలుగు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కాయి.