దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి, జస్ప్రిత్ బూమ్రాలు తమ టాప్ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో భాగంగా బ్యాటింగ్ విభాగంలో కోహ్లి 887 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా, బౌలింగ్ విభాగంలో బూమ్రా 808 రేటింగ్ పాయింట్లతో టాప్ను నిలబెట్టుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో మూడు వరుస హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఎంఎస్ ధోని మూడు స్థానాలను మెరుగుపరుచుకుని 17వ స్థానానికి చేరాడు.
ఇక జట్టు ర్యాంకింగ్స్ విషయంలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. కివీస్తో వన్డే సిరీస్ తర్వాత 122 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఇంగ్లండ్(126 పాయింట్లు) ఉండగా, ఆ తర్వాత స్థానంలో టీమిండియా ఉంది. భారత్తో సిరీస్లో ఘోర ఓటమి పాలైన న్యూజిలాండ్ నాల్గో స్థానానికి పడిపోయింది.