నాగ్పూర్: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. కోహ్లి 107 బంతుల్లో 9 ఫోర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు 55 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరిన కోహ్లి దాన్ని సెంచరీగా మలచుకున్నాడు. ఇది కోహ్లి వన్డే కెరీర్లో 40 సెంచరీ. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లు ఆరంభించారు. అయితే రోహిత్ డకౌట్గా పెవిలియన్ చేరడంతో భారత జట్టు పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్ను నష్టపోయింది. ఆపై ధావన్-కోహ్లిల జోడి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లింది.
వీరిద్దరూ 38 పరుగుల జత చేసిన తర్వాత ధావన్(21) రెండో వికెట్గా నిష్క్రమించాడు. మ్యాక్స్వెల్ బౌలింగ్లో ధావన్ ఎల్బీగా ఔటయ్యాడు. ఆపై అంబటి రాయుడుతో కలిసి కోహ్లి మరో 37 పరుగులు జత చేశాడు. కాగా, రాయుడు(18) మూడో వికెట్గా పెవిలియన్ బాట పట్టాడు. ఆ తరుణంలో కోహ్లి-విజయ్ శంకర్ జంట ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ క్రమంలోనే కోహ్లి హాఫ్ సెంచరీ నమోదు చేయగా, విజయ్ శంకర్ నాల్గో వికెట్గా ఔటయ్యాడు. అటు తర్వాత కేదార్ జాదవ్(11), ఎంఎస్ ధోని(0) వెనువెంటనే ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. కాగా, ఆ సమయంలో కోహ్లితో జత కలిసిన రవీంద్ర జడేజా కదురుగా బ్యాటింగ్ చేశాడు. మరొకవైపు కోహ్లి సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ మార్కును చేరాడు.