విజేతలు లలిత, గౌతమ్‌ | Sakshi
Sakshi News home page

విజేతలు లలిత, గౌతమ్‌

Published Thu, Jul 12 2018 10:24 AM

Lalit, Gowtham won regatta championships - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్‌ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ యాటింగ్‌ క్లబ్‌ సెయిలర్లు మజ్జి లలిత, గౌతమ్‌ కంకట్ల సత్తా చాటారు. హుస్సేన్‌సాగర్‌లో జరిగిన ఈ టోర్నీలో లలిత ‘తెలంగాణ స్టేట్‌ సెయిలింగ్‌ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌’ ట్రోఫీని అందుకుంది. ఓపెన్‌ కేటగిరీలోనూ రెండో స్థానంలో నిలిచి రజతాన్ని గెలుచుకుంది. మరోవైపు జూనియర్స్, ఓపెన్‌ జూనియర్స్‌ కేటగిరీల్లో గౌతమ్‌ చాంపియన్‌గా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. బాలికల సబ్‌ జూనియర్స్‌ కేటగిరీలో తొలి మూడు స్థానాలను తెలంగాణ అమ్మాయిలే దక్కించుకోవడం విశేషం.

49 పాయింట్లతో లలిత స్వర్ణాన్ని గెలుచుకోగా... మహబూబీ (53), లక్ష్మి నూకరత్నం (56) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. ఓపెన్‌ విభాగంలో కర్ణాటకకు చెందిన చున్నుకుమార్‌ 19 పాయింట్లతో విజేతగా నిలిచాడు. లలిత (49) రన్నరప్‌గా నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమా చౌహాన్‌ 52 పాయింట్లతో మూడోస్థానాన్ని దక్కించుకుంది. బాలుర జూనియర్స్‌ విభాగంలో 29 పాయింట్లతో గౌతమ్, సంజయ్‌ రెడ్డి (47), టి. అజయ్‌ (52) వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. ఓపెన్‌ జూనియర్స్‌ విభాగంలో గౌతమ్‌ (29), రామ్‌ మిలన్‌ యాదవ్‌ (31, మధ్యప్రదేశ్‌) స్వర్ణ, రజతాలను గెలుచుకోగా... సతీశ్‌ యాదవ్‌ (32, మధ్యప్రదేశ్‌) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement