మెల్ బోర్న్: రెండో టెస్టు సందర్భంగా నాల్గో రోజు డ్రెస్సింగ్ రూమ్ లో చోటు చేసుకున్న ఉదంతంపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. ఆ ఘటనపై రోజుకో కథనం బయటకు రావడంతో ధోనీ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఆ రోజు జరిగిన ఘటన సినిమా కథను తలపిస్తోందన్నాడు. విరాట్ కోహ్లీ కత్తితో బెదరిస్తూ శిఖర్ ధావన్ పై దాడికి యత్నించినట్లు వచ్చిన వార్తలను ధోనీ కొట్టిపారేశాడు.
కోహ్లీ దాడికి యత్నించే సమయంలో తాము అతన్ని గెంటేసినట్లు వచ్చిన కథనాలు ఊహాజనితాలు మాత్రమేనన్నాడు. అసలు ఆ తరహా వార్తలు ఎక్కడ్నుంచి వస్తాయో తనకైతే తెలియడం లేదన్నాడు. ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్ లో చోటు చేసుకున్న ఉదంతంపై మార్వెల్, వార్నర్ బ్రదర్స్ ఒక సినిమా రూపొందించే అవకాశం కూడా ఉందని చమత్కరించాడు.