సింధు ఫిర్యాదుపై ఇండిగో స్పందన..బాయ్‌ రియాక్షన్‌! | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 4 2017 8:45 PM

Met Sindhu, spoke to her on the issue, says BAI president - Sakshi

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు చేసిన ఫిర్యాదుపై ఇండిగో విమానయాన సంస్థ ఆచితూచి స్పందించింది. సింధుకు చేదు అనుభవం ఎదురైన ఘటనలో తమ సిబ్బంది తప్పు ఎంత మాత్రం లేదని, ప్రయాణీకులతో గౌరవంగా వ్యవహరించామని చెప్పుకొచ్చింది. విమానంలో తమ బాధ్యతను మాత్రమే సిబ్బంది నిర్వర్తించారని, అంతే తప్ప ఎవరితో అనుచితంగా ప్రవర్తించలేదని ఇండిగో తెలిపింది.

హైదరాబాద్‌ నుంచి ముంబైకి ప్రయాణిస్తుండగా ఇండిగో విమానంలో ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగి ఒకరు అమర్యాదగా ప్రవర్తించారని సింధు ట్విట్టర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సింధుకు నెటిజన్లంతా మద్దతుగా నిలిచారు. ఇండిగో గ్రౌండ్‌ సిబ్బంది అజితేష్‌ తనతో రూడ్‌గా బిహేవ్‌ చేశాడన్నది సింధు ఆరోపించారు. ప్యాసింజర్స్‌తో మర్యాదగా వ్యవహరించొద్దని ఎయిర్‌ హోస్టెస్‌ అషిమా హెచ్చరించినా.. అతడు పట్టించుకోలేదని సింధు పేర్కొన్నారు. ఆమెతోనూ అజితేష్‌ అనుచితంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇలాంటి వాళ్ల కారణంగా పెద్ద సంస్థలకు కూడా చెడ్డపేరు వస్తుందని సింధు పేర్కొంది. ఈ వివాదంపై భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ (బాయ్‌) అధ్యక్షుడు హిమంత్‌ బిస్వా శర్మ స్పందించారు. పీవీ సింధుతో తాను సమావేశమై.. ఘటన గురించి చర్చించానని, అసలు ఏం జరిగిందో సింధు వివరించిందని, దీనిపై ఏం చేయాలనేది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హిమంత బిస్వా తెలిపారు.

Advertisement
Advertisement