సిడ్నీ:ఇప్పటికే వరల్డ్ కప్ లో సంచలనాలకు తెరలేచిన సంగతి తెలిసిందే. పసికూనగా బరిలోకి దిగిన ఐర్లాండ్.. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ ను మట్టికరిపించడంతో పెద్ద జట్ల సైతం అప్రమత్తమవుతున్నాయి. ఫిబ్రవరి 21 వ తేదీన ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్లు తమ ఎత్తుగడలకు పదునుపెట్టే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఓడించేంత పనిచేసిన బంగ్లాదేశ్ ను తక్కువ ర్యాంక్ టీమ్ గా చూడకుండా సాధారణ ఆటతీరునే అవలంభిస్తామని ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ తెలిపాడు. దీనిలో భాగంగానే ఆ క్రికెటర్ల వీడియా ఫుటేజ్ ను చూడనున్నట్లు జాన్సన్ అన్నాడు.
'నాకు ఆటగాళ్ల వీడియో ఫుటేజ్ చూసే అలవాటు లేదు.అయితే బంగ్లాదేశ్ టీంలో కొంతమంది కీలక ఆటగాళ్లు ఉన్నారు. వారు ఏ రకంగా ఆడుతున్నారో ఒకసారి పరిశీలించాలి' అని మిచెల్ తెలిపాడు.